Tuesday, February 17, 2009

చదువు సాగదు...బతుకు మారదు

అపుడెప్పుడో వినేవాళ్ళం.చెంచు రేంజర్ అని, చెంచు ఫారెష్టరని.అంటే తెల్లవాడి పాలనలో కొదరు చెంచులకు చదువబ్బిందని అర్థమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 6దశాబ్దాలు గడచినా నాలుగు జిల్లాలలోని అన్నిచెంచు గూడేలు పరికించి చూసినా పదవ తరగతి పాసైన చెంచు బాలుడు ఒక్కడు కనిపించడు.ఇటీవల ప్రారంభమైన రామచంద్రమూర్తి hmtv కోసం చెంచు జాతికి చెందిన రిపోర్టర్ కోసం వెదికారు. కనీసం టెంత్ పాసైతేచాలు అంతానేర్పించు కుంటామని రామ్మోహన్ గారు అక్కడక్కడా వాకబు చేశారు.ఎంతో వెతుకులాట తరువాత ఒ అబ్బాయి దొరికాడు. అతడి తండ్రి కి ఎలాగో కాస్త అక్షర జ్నానం రాగా అటవీ శాఖలో చిరు ఉద్యోగ చేయడం ద్వారా కొడుకును చదివించుకో గలిగాడు. ఇదీ చెంచుల్లో విద్యాపరిస్థితి.మరి ప్రభుత్వమేం చేస్తోంది అన్న అనుమానం మీకు కలగవచ్చు. చెంచుల అభివృధ్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీ ITDA ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలలో దాదాపు 200 వివిధ స్తాయిల్లోని పాఠశాలలు ఉన్నాయి.శ్రీశైలంలో ఒ పాలిటెక్నికల్ కళాశాళ కూడా వుంది. సమీకృత గిరిజన వసతి గృహాలున్నాయి.ఇన్ని వున్నా మరి చెంచులకు చదువెందుకబ్బదు.ప్రభుత్వ అధికారులలోని చిత్తశుద్ది లోపం,అవినీతి ఇందుకు కారణాలుగా భావించ వచ్చును. అయితే ప్రధాన కారణం మాత్రం విద్యాభోధనలో అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానమే అని చెప్పవచ్చు. చెంచులు ప్రకృతి మాత ముద్దుబిడ్డలు.చెట్లవెంట,పుట్టలవెంటతిరుగుతూనే పెరిగి పెద్దవారవుతారు. అలాంటివారిని నాలుగు గోడల మధ్య బంధించి బెత్తాలతో బెదిరిస్తె సున్నిత మనస్కులై చెంచులకు రుచిస్తుందా. ఇక్కడా అదే జరిగింది.కడుపునిండా తిండి లేని చెంచులపిల్లలు అన్నం వేళల లో మాత్రమే హాస్టల్ల వైపు పరుగులు తీస్తారు. "శామీ బువ్వపేట్టు..." అంటూ తమ అన్నాన్ని తామే అడుక్కుంటుంటారు.పై మీద చింకిపాత తప్ప ఈ చెంచుపిల్లగాళ్ళు వేరెరుగరు. అయితే ఇటిడిఎ లో పని చేసే ఏచిన్న ఉద్యోగి పిల్లలైనా సరే సీతాకోక చిలుకల్లా రంగురంగుల యూనిఫాం లలో పట్టణాలలోని ప్రవేటు కాన్వెంట్లకు వెళుతూ కనిపిస్తారు.పెద్దపిల్లలయితే పల్సరు బండ్లపై తప్ప కాలు కింద మోపరు.వీళ్ళకు ఈ సొమ్మంతా చెంచుల పేర జమ రాసుకుని బొక్కిన సొమ్మేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. చెంచు పిల్లలను వెంట బెట్టుకుని కొండల్లో తిరుగుతూ చెట్టు పుట్టాచూపుతూ ప్రకృతిపరంగా చెప్పాల్సిన విధ్య రొడ్డకొట్టుడుగా మారడం విచారకరం. తెలుగు పత్రికలు చదివేవారికి వాడ్రేవు చిన వీరభధ్రుడు తెలిసేవుంటారు.అభ్యుదయవాదిగా,సున్నిత మనస్కుడిగా ఆయన రచనల ద్వారా మనకర్థమవుతారు.ఆయన కూడా చెంచుల కోసం ఏర్పాటు చేసిన శ్రీశైలం ఇటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా పని చేసి వుండడం కొసమెరుపు.

3 comments:

  1. నేను కూడా గిరిజన కుటుంబం నుంచి వచ్చిన వాడినే. కానీ మా అమ్మానాన్నలు బ్యాంక్ ఆఫీసర్లు కావడం వల్ల మమ్మల్ని ఎవరూ జాతి పేరుతో తక్కువగా చూడలేదు. చిన్నప్పుడు నేను తరుచూ ఫొటోగ్రఫీ కోసం గిరిజన ప్రాంతాలకి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు మైదాన ప్రాంతాలలో కూడా ఫొటోలు తీసేవాడిని. గిరిజన ప్రాంతాలలో ఇప్పుడు కూడా అక్షరాస్యత చాలా తక్కువగా కనిపిస్తోంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా గిరిజన ప్రాంతాలలో స్కూళ్ళు ఉండేవి. మా తాతగారు దక్షిణ ఒరిస్సాలోని ఒక మారుమూల అడవిలో ఉన్న గిరిజన గూడలో ఉండేవారు. అతను తన గూడ నుంచి రెండు మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్ లో మూడవ తరగతి వరకు చదివారు. అప్పట్లో అంత కంటే ఎక్కువ చదువుకునే అవకాశం ఉండేది కాదు. మా నాన్నని, పెదనాన్నని మాత్రం టౌన్ కి పంపించి హాస్టల్ లో చదివించాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో అక్షరాస్యత ౩౦% మాత్రమే ఉంది.

    ReplyDelete
  2. మీతో,
    మాట్లాడాలనిపిస్తోంది.అభ్యంతరం లేకపోతే నా మైల్ కు రాయండి.(nallamala.reddy@gmail.com)
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  3. మెయిల్ పంపడానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడే మాట్లాడడం బెటర్ అనిపిస్తోంది. I will be sure to send you a mail.

    ReplyDelete