Monday, September 20, 2010

కొండా..కోనల్లో లోయల్లో..గోదారి గంగమ్మా ఛ్ఛాయల్లో

ఈ గీతం నల్లమల చెంచు బాలలకు చక్కగా అన్వయమవుతుంది. కాకపోతే గోదారి స్థానంలో కృష్ణమ్మనో,చారుఘోషిణినో,గాలేరు వాగునో,మరొ నీటిబుగ్గనో చేర్చుకోవాలి.ఎత్తైన కొడలు..లోతైన లోయలు.. మేఘాలను తాకే మహావృక్షాలూ రాళ్ళను దొర్లించే వేగంతో పారే సెలయేళ్ళు అన్ని చెంచుల బాల్య క్రీడలకు వేదికలే.













అసలు చెంచుల స్వేఛ్ఛాయుత జీవనానికి వారి బాల్యమే మనకు కొండ గుర్తులను సూచిస్తుంది.అమ్మ అవకాశం వుండి వండితే ఆ బువ్వను ఇంత చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్షగా వేసుకుని చెంచుపిల్లలు దబ్బ తొక్కి విడిచిన అంబులా(నారి సారించి విడిచిన బాణంలా)గాలిని చీల్చుకు వెళ్ళే తూనీగలా అడవిలోకి వెళతారు.కడుపులో అత్మారాముడు తిరిగి గోల చేసేవరకు వీరి క్రీడలు సాగుతాయి. ఆటలతోనే వీరి ఆహార సేకరణకూడా సాగుతుంది.టుమికి,చిటిమిటి,ఎలగ ,రేగు,కొండీత,పాల,పరికి,బలస,పేర్లు కూడా తెలియని మరెన్నో జాతుల పండ్లను అడవితల్లి చెంచు పిల్లల కోసం అయా రుతువుల్లో అమర్చి పెట్టె వుంటుంది.కాని నాగరిక ప్రపంచపు దుర్మార్గానికి అడవుల్లోని పళ్ళచెట్లు మయమవుతూ వున్నాయి.లేకపోతే చెంచు పిల్లలు అడవిలో తాము తిన్నన్ని తిని కూడా బయటి సమాజంలోని తమ నేస్తాలకు కూడా వాటిని అందుబాటు(అమ్మకాల ద్వారా)లోకి తెచ్చే వారు.













పచ్చదనపు క్యాన్వా స్ పై ప్రకృతి చిలికిన రంగవళ్ళులలాంటి సీతాకోక చిలుకల వెంట చెంచు పిల్లల పరుగులకు అడ్డు ఆపు వుండదు. ఆపరుగులో గెలిచిన వాడు తాను పట్టిన సీతాకోక చిలుకకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండాదాని రెక్కలపై వుండే బూడిదను వేళ్ళకు పట్టించుకుని నుదుటన వీభూధిలా ధరించి తాను పట్టిన సీతాకోక చిలుకకు స్వేఛ్ఛను ప్రసాదించి,విజయగర్వంతో ముందుకు సాగుతాడు. నల్లమలలోని కొలను భారతి సరస్వతీ క్షేత్రం లో వున్న చారుఘోషిణీ మైదాన ప్రాంతాల వారికి ఇత్తమ గతులను ఇచ్చే తీర్తమే కావచ్చు కానీ ఈ కొండ వాగు మాత్రం చెంచు పిల్లల నల్లని శరీర స్పర్శకు పొంగి పోతుంది. వారిని అప్యాయంగా తడుముతూ మాతృత్వపు తీపిని ఆస్వాదిస్తుంది.కర్నూలు లాంటి నగరాలను వణికించిన తుంగ భద్రమ్మ,కృష్ణమ్మలు సంగమించి నల్లమలలో మహోగ్రంగా ప్రవహించినప్పటికి చెంచు బాలలు సరదా పుట్టి పుట్టిలో నదీ ప్రవేశం చెస్తే వారినే మాత్రం ఇబ్బంది పెట్టకుండా అలలను స్వయం నియంత్రించు కుంటుంది.

పువ్వులాంటి సున్నితత్వం, తూనీగలాంటి స్వేచ్చాప్రియత్వం వున్న చెంచు పిల్లలకు నాలుగు గోడల మద్య నిర్భందంగా విద్య భోదించాలను కుంటే వీలవుతుందా? ప్రస్తుతం నల్లమల చెంచు పిల్లలకు ఇలాంటి అశాస్త్రీయ పద్దతిలోనే ప్రభుత్వం విద్యాసంస్థలను నడుపుతోంది.కొట్లాది రూపాయలు ఖర్చవుతున్నా గత రెండు దశాబ్ధాలలో పది దాటినవారు పది సంఖ్యను ను దాటి వుండరు.

Wednesday, March 31, 2010

చెరగని మారని శిలాక్షరాలు వారి జీవితాలు

బ్రహ్మ అందరి తలరాతలు రాస్తుంటాడని మన వాళ్ళు నమ్ముతుంటారు. ఆయన రాతలను బట్టే వారి జీవితాలు కొనసాగుతాయని భావిస్తారు.అలాంటి లలాఠ లిఖితమేదో మారని,చెరగని శిలాక్షరమై నల్లమల చెంచుల జీవితాలను నిర్దేశిస్తున్నట్లుంది. ఒకప్పటి చెంచుల రాజధాని గా భావించే పెచ్చెరువు చెంచు గూడెంలో ఆంగ్లేయుల కాలంలోనే మాద్యమిక పాఠశాల తొ పాటు,విధ్యార్థులకు వసతి గృహము ఉండేది. ఒక ఆసుపత్రి,అందులో తగినంత సిబ్బంది ఉండేవారు. ఆవస్తులతో అప్పట్లోనే చెంచులు అటవి శాఖలో ఉన్నత ఉద్యోగాలు పొందారు. నేడు ఈ చెంచుల రాజధాని అసలు రెవెన్యూ గ్రామమే కాదు.పులుల అభయం కోసం పునారావాస వన(మైదాన)వాసాన్ని అనుభవించ లేక చచ్చిన వారు చావగా ఏ కొద్ది మందో తిరిగి తమది కాని తమ గూడెంలో చేరారు.అన్నిహక్కులతో పోరాడితేగాని కదలని ప్రభుత్వాలున్న ఈ రోజుల్లో నివాసహక్కు కోల్పోయిన పెచ్చెర్వు చెంచులకు ప్రభుత్వం అందజేసే సౌకర్యం ఏమాత్రమో మనకర్తమవుతుంది. ఐటిడిఏ దయతలచి ఇస్తున్న అరకొర సాయంతోనే ఈ గూడెం చెంచులు బతుకులు వెల్ల మారుస్తున్నారు. ఈ గూడెంలో ఐటిడిఏ నిర్వహిస్తున్న ఓ గిరిజన వికాస కేంద్రం ఉంది. ఇందులో పని చేసే ఇద్దరు ఉపాద్యాయులు 40 మంది పిల్లలకు అక్షర జ్నానం అందిస్తుంటారు.

అయితే చెంచుల నుదుటి రాతలాగే వీరి పిల్లల అక్షరాభ్యాసం కూడా కఠిన శిలలపైనే సాగుతోంది.పాఠశాలలో పరచిన నాపరాళ్ళపైనే ఈ పిల్లలు అక్షరాలను దిద్దుతూ కనిపిస్తారు.ఒక్క పిల్లవాడికి కూడా పలక బలపం లేక పోవడంతో బండరాల్ల పైనే తమ అక్షర దక్షత చూపుతుంటారు.గతంలో ఈ గూడేనికి చెందిన చెంచు యువకుడు దాసరి కొండన్న మావోయిస్టులతో సంబందాలు(?) కలిగి వున్నాడన్న సమాచారాన్ని ఎక్కడో హైదరాబాదులో వుండే SIB పసిగట్టడం వెంటనే ఎన్ కౌంటర్ లో చంపి వేయడం కూడా రోజుల్లోనే జరిగింది. కాని ఈ గూడెంలో నీళ్ళు లేని కారణంగా ఎవరూ నెలల తరబడి స్నానాలు చేయడం లేదని పెద్దవాళ్ళు అప్పుడప్పుడైనా తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటుంన్నా పసి వారికి ఆభాగ్యం కూడా లేక ఒంటిపై మన్ను పేరుకు పోయి పుడ్లు లేచి రొసికలు కారుతున్న సమాచారం ఏ ప్రభుత్వ అధికారికి అందక పోవడం యాదృఛ్ఛికమైతే కాదు.

ఇదే గూడేనికి చెదిన ఉత్తలూరి గుర్రన్న ఓ తాగుబోతు అంబుల వేటుకు గురి కాగా రొమ్మున దిగిన అమ్ములతో 11గంటలు విలవిలలాడి ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఈ అడవి బిడ్డ ఆర్తనాదం 108 ఆంబులెన్స్ కు చేరడానికి ఆ సమయం పట్టింది.పౌష్టికాహార లోపం వల్ల ప్రతి చెంచు గూడెంలోనూ బుద్ది మాంద్యం ఉన్న పిల్లలు కనపడుతూనే వుంటారు. ఇంతటి సామాజిక వివక్షకు గురవుతున్న చెంచులకు బయటి సమాజపు బుధ్ధి జీవుల మద్దతు అంతగా కనపడదు. వీరి పేరు చెప్పి దండుకునే NGO లు,వీరి పేరిట పద్దురాసి జేబులు నింపుకునే ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రం వీరి చుట్టూ గిరికీలు కొడుతూ ఏదో చేస్తున్న భ్రమలు కల్పిస్తూ ఉంటాయి.అందుకే చెంచులు తమ పోరు తాము చేసుకోగల్గిన స్తైర్యాన్ని కలిగించేందుకు పౌర సమాజం ముందుకు రావాలి.

Wednesday, March 24, 2010

ఈనిండు గర్భిణి ఒంట్లో చుక్క రక్తం లేదు

నల్లమలలోని చెంచు మహిళలు ధైర్యానికి ప్రతీకలు.పెద్దపులి ఎదుట నిలిచినా,ఎలుగ్గొడ్డు మీదపడినా ఏమాత్రం జంకక వాటితో పోరాడిన చరిత్ర కలవారు.కాని ఈ ధీరలు తీవ్రమైన రక్తహీనతతో సులువుగా తమ ప్రాణాలను మృత్యుకోరలకప్పగిస్తున్నారు.నల్లమలలో దొరికే గడ్డలు తవ్వి తీసి,ఆకులు,అలములు కోసుకుని పొట్టపోసుకునే చెంచు గిరిజనుల ఆహారంలో సహజంగానే పౌష్టిక విలువలు ఉండవు.దీంతో చెంచులను గాలికి రోగాలు తడుముతూనే వుంటాయి.అదుకే TB లాంటి రోగాలకే ప్రాణాలు విడుస్తారు.వీరి సగటు ఆయుర్ధాయం అందుకే 45కు మించదు.ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ఆరోగ్య సమస్యలుండె మహిళలు దారుణమైన స్థితిలో వున్నారు. ఈనెల 22న కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపములోని బైర్లూటి చెంచు గూడెంలో అటవీ శాఖ ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసింది. ఆరోజు ఈ ఒక్క చెంచు గూడేనికి చెందిన 21మంది గర్భిణులను పరీక్షించగా వారంతా తీవ్రమైన రక్త హీనతతో వున్నట్లు గుర్తించారు.వీరిలో ఈ సమస్య ప్రమాదస్తాయి దాటినట్లు కూడా తేలింది. పైన కనపడే చిత్రంలో ఉన్నకుడుముల మంతమ్మ ఎనిమిది నెలల గర్భిణీ. ఈమె పరిస్తితి మరింత ప్రమాదకరంగా వుండడంతో వైద్యులు కర్నూలు సర్వజన వైద్యశాలకు వెళ్ళమని సిఫార్స్ చేశారు. ఆమె అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే స్థోమత వుండి వుంటే మొదట ఆమెకు మంచి ఆహారం తినే అవకాశమే వుడేది.అందువల్ల ఆమెకు ఆ రక్తహీనత వచ్చి వుండేదే కాదు కదా.











ఈ పరిస్థితి ఒక్క బైర్లూటికి సంబందించిందే కాదు. కర్నూలు,మహబూబ్ నగర్,ప్రకాశం,నల్లగొండ,గుంటూరు జిల్లాల పరిధిలోని నల్లమల అడవుల్లో వున్న దాదాపు నలబై వేల చెంచుల్లో సగభాగమైన చెంచితల రగులుతున్న సమస్య.ఆదిమ గిరిజనులైన చెంచుల అభివృధ్ధి సమీకృతంగానే జరగాలని ఐటిడిఎ గా ఏర్పడిన ప్రభుత్వ ఏజెన్సీ ఈ చెంచితల సమస్యను గుర్తించక పోవడం ఇక్కడి విషాదం.

Thursday, March 11, 2010

ఆశచూపి బతుకు కూల్చే యత్నం..డబ్బులిచ్చి పారద్రోలేప్రయత్నం

నిర్వాసితం మరణంతో సమానం.పునరావాసం జీవన్మరణ స్తితి. ప్రపంచ వ్యాప్తంగా అభివృధ్ది పేరిట జరుగుతున్న విధ్వంసంలో సమిధలవుతున్న గిరిజనులు మాదిరే నల్లమల చెంచులు కూడా అశాస్త్రీయ పునరావాస బాణానికి గాయపడ్డారు.పులుల అభయారణ్యంలొ మానవ సంచారం వుండరాదంటూ, అడవుల్లో అనాగరికంగా బతుకుతున్నారని వారిని నాగరిక(?) సమాజంలో కలిపేందుకంటూ కారణాలను చూపుతూ రెండున్నర్ర దశాభ్దాల పలు చెంచు గూడేలను ప్రభుత్వం బలవంతంగా తరలించింది. ఇలా చెంచులు మొట్టమొదటి సారిగా తమ సహజ ఆవాసాలకు దూరమయ్యారు.ఈ పునరావాస పథకం చెచుల జీవితాలను ధుర్భరం చేసింది. ఈ ప్రయోగం ఎంతటి వైఫల్యం చెందిందొ ఆత్మకూరు అటవీ డివిజన్ లోని పెచ్చెరువు,రుద్రకోడూరు, పసురుట్ల లాంటి చెంచు గూడాలు సజీవ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ _ శ్రీశైలం పులుల అభయారణ్యం ఏర్పాటుకాగానే మొట్టమొదుట అటవీబహిష్కారం పొందిన చెంచు గూడెం పెచ్చెరువు. వీరికి దట్టమైన అటవి ప్రాంతం నుంచి సుమారు 50కి.మీ దూరంలో వున్న మైదాన ప్రాంతంలోని కొట్టాలచెరువులొ పునరావాసం కల్పించారు.పొలాలిచ్చి దున్నుకోమన్నారు. ఆహారసేకరణ దశ దాటని చెంచులను ఇలా మానవ జీవ పరిణామ క్రమంలోని మలి దశ అయిన వ్యవసాయానికి ప్రభుత్వం ఓ గెంతుతో తీసుకు పోదల్చింది.ప్రభుత్వంతో పాటు గెంతలేని చెంచులు బతుకు కోసం జీవన్మరణ పోరాటం చేసారు.ఈ పోరాటంలో రోగాలు,పౌష్టికాహార లోపాలతో వందలాది మంది మరణించారు. చచ్చినవారు చావగా మిగిలినవారు బతుకు జీవుడా అంటు తమ తొలి ఆవాసమైన పెచ్చెర్వుకు చేరుకున్నారు.కాని అప్పటికే వారి గూడెం రెవిన్యూ రికార్డుల్లో మాయమైంది.ఇలా ఒకప్పటి చెంచుల రాజధాని అయిన పెచ్చెర్వు ప్రస్తుతం చట్ట వ్యతిరేకంగా చెంచులు నివశిస్తున్న ప్రాంతంగా మిగిలి పోయింది.ఇలాగే నాగరిక సమాజపు జీవన్నాన్ని రుచి చూపుతామంటూ ఆత్మకూరు మండలం నల్లకాలువ పరిధిలోని నల్లమలలో వున్న జంట చెంచు గూడాలు రుద్రకోడు,పసురుట్ల లను నల్లకాలువ గ్రామంలో పునరావాసం కల్పించారు.ఐతే అడవిలో దొరికే కాయకసురు ఏరుకుని పట్టణాలలో అమ్ముకుని స్వతంత్ర ఆర్థిక జీవనం గడిపే చెంచులను ఈ పునరావాసం పరాన్నభుక్కులుగా మార్చింది.వరకట్నం,గృహ హింస,వ్యభిచారం,స్వంత ఆస్తి స్వార్థం,వంటి సమకాలీన నాగరిక సమాజపు దిర్వవహారాలు ఏవీ లేని చెంచులు అనతి కాలంలోనే సర్వభ్రష్టత్వం పొందారు. తిరిగి అడవి చేరుకోలేని వీరు నల్లకాల్వలో భిక్సుక వృత్తితో బతుకు తున్నారు.
ఈ పునరావాస వ్యవహారంతో పాఠాలు నేర్చుకోని ప్రభుత్వాలు తిరిగి చెంచులను పనిగట్టుకుని మరోమారు అడవులకు దూరం చేయబోతోంది.ఈ సారి డబ్బుల మూటలతో చెంచులను బెలిపించి వారి అస్తిత్వాన్ని రూపుమాపనెంచింది. పులుల అభయారణ్యంలో వున్న చెంచు కుటుంబాలకు ఒక్కింటికి రూ10 లక్సలు ఇవ్వడం ద్వారా ఈ వ్యవహారం చక్కదిద్ద దల్చింది.ఈ వ్యవహారమంతా చాపకింద నీరులా సాగుతోంది. కానీ మానవ పరిణామ క్రమంలో వేల సంవత్సరాల వెనుకెక్కడో నిలిచిపోయిన జాతిని సంరక్సించే పద్దతి ఇదేనా?.మావోల డంపు దొరికితే అగ్గి పెట్టెకు ఐదువందలిచ్చి కొన్న వెనుకుబాటు చెంచులది.పదికోట్లిచ్చినా అభివృద్ది చెందుతారా. వారి జీవితాలకు సమీకృత అభివృధ్ధి నెనరు కల్గిన అధికారుల పర్యవేక్సణ అవసరమని చెబుతున్న ప్రజాస్వామిక వాదుల మాటలు వినపడతాయా? ప్రముఖ స్వచ్చంద సేవకులు బ్డి శర్మ ఓ సంధర్భంలో మట్లాడుతూ మొక్కను పెరికి నాటితే బతుకుతుంది కాని చెట్టును కాదు అన్నమాటలు మన పాలకుల చెవులకెక్కేదెలా?

Friday, March 5, 2010

చెంచుజాతి విలుప్త ప్రమాదపు అంచుల్లొ వుంది..మీకెవరికైనా పడుతోందా

కర్నూలు,ప్రకాశం,గుంటూరు,మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి.తూర్పు కనుమల్లో భాగమైన ఈ అడవుల్లో ప్రపంచంలోనే జీవించి ఉన్న అతి పురాతన ఆదిమ గిరిజన తెగ ఐన చెంచులు జీవించి వున్నారు.నేడు చెంచు జనాభ కేవలం ఇరవై వేల లోపు మాత్రమే వుంది.సరైన లెక్కలు తీసి వుంటారనుకోవడం మన భ్రమే.ఒకప్పుడు అధ్బుతమైన జీవన శైలితో నల్లమల రారాజులుగా వెలుగొందిన చెంచులు నేడు వేగంగా పడిపోతున్న తమ జనసంఖ్యను ఎలా కాపాడు కోవాలో తెలియని వెనుకబాటు తనంతో నిష్క్రియాపరత్వంతో వున్నారు.వేలాది సంవత్సరాలుగా జన్యు మార్పిడి లేని జాతి ప్రపంచంలో చెంచులే.అదే ఈ జాతికి శాపంగా మారింది. స్వజాతి పరిధిని దాటని లైంగిక బంధం జాతి ప్రవర్ధనానికి సంకెలగా మారింది.అదే ఈజాతి రోగ నిరోధక శక్తిని హరించింది. నేడు చెంచుల సగటు ఆయుర్ధాయం 45 సంవత్సరాల లోపే.చెంచు చేతిలో చేయి వేస్తే మనకు ఓ జలచరాన్ని స్పర్శించి నట్లు మెత్తగా చల్లగా వుంటుంది. చెంచుల్లో కొందరు కొండ దిగి యానాదులయ్యారు. వీరు చెంచులతో పోలిస్తే కొంత ఆరోగ్యంగాను,ధృడంగానూ వుంటారు. దీనికి కారణం వారిలో వచ్చిన జన్యు వైవిద్యమే. జన్యు వివిధత లేని చెంచు జాతిని TB వెంటాడి హతమారుస్తుంటే సామాజిక పీడన పౌష్టికాహార లోపం జాతి హననానికి కారణమవుతుంది.విలుప్తమవుతున్న జంతువుల పరిరక్సణ కోసం తెగ తాపత్రయ పడే ఆధునిక సమాజం తనతో పాటు పుట్టి జీవన పోరాటంలో అలసి ఓడి పోతున్న సహ మానవ జాతిని కాపాడుకునే ప్రయత్నం చేయక పోవడం తనలోని మానవీయ విలువల పతనాన్ని సూచిస్తుంది.

Tuesday, March 2, 2010

అగ్నిపూల సౌందర్యం _ అంతులేని మాధుర్యం


మా చెంచుల భాధలే కాదు మా నల్లమల అందాలను కూడా మీ ముందుంచాలని సంకల్పించాను.
శిశిరం పచ్చదనానికి శత్రువు. కంటికింపైన వృక్ష సౌందర్యాన్ని నాశనం చేస్తుంది. కాని చెట్లు తిరిగి చిగురిస్తూ ప్రకృతికి ప్చదనాన్ని వాగ్దానం చేస్తూనే వుంటాయి.అయితే పౌరు షానికి ప్రతీకలా నలమలలోని మోదుగ చెట్టు(లత) శిశిరాన్ని నిరశిస్తూ విచ్చు కత్తులలాంటి అగ్నిపూలను వికసిస్తుంది.ఈ మంకెన పూలు ఆకు రాలి మోడువారిన మోదుగ ధర్మాగ్రహాన్ని కొట్టొచ్చినట్లు అల్లంత దూరానికి కనిపించేలా చేస్తాయి.అయితే మాధుర్య సంకలనమే తప్ప భావోద్వేగాలతో నాకేం పని అనుకుంటుందో ఏమో గాని ఈ కాటుక పిట్ట మంకెన పూలలోని మధువును గ్రోలి ఇలా విలాసంగా ఎగురుతోంది.హృదయంతో చూస్తె నలమలలో ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తాయి.