Monday, September 20, 2010

కొండా..కోనల్లో లోయల్లో..గోదారి గంగమ్మా ఛ్ఛాయల్లో

ఈ గీతం నల్లమల చెంచు బాలలకు చక్కగా అన్వయమవుతుంది. కాకపోతే గోదారి స్థానంలో కృష్ణమ్మనో,చారుఘోషిణినో,గాలేరు వాగునో,మరొ నీటిబుగ్గనో చేర్చుకోవాలి.ఎత్తైన కొడలు..లోతైన లోయలు.. మేఘాలను తాకే మహావృక్షాలూ రాళ్ళను దొర్లించే వేగంతో పారే సెలయేళ్ళు అన్ని చెంచుల బాల్య క్రీడలకు వేదికలే.













అసలు చెంచుల స్వేఛ్ఛాయుత జీవనానికి వారి బాల్యమే మనకు కొండ గుర్తులను సూచిస్తుంది.అమ్మ అవకాశం వుండి వండితే ఆ బువ్వను ఇంత చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్షగా వేసుకుని చెంచుపిల్లలు దబ్బ తొక్కి విడిచిన అంబులా(నారి సారించి విడిచిన బాణంలా)గాలిని చీల్చుకు వెళ్ళే తూనీగలా అడవిలోకి వెళతారు.కడుపులో అత్మారాముడు తిరిగి గోల చేసేవరకు వీరి క్రీడలు సాగుతాయి. ఆటలతోనే వీరి ఆహార సేకరణకూడా సాగుతుంది.టుమికి,చిటిమిటి,ఎలగ ,రేగు,కొండీత,పాల,పరికి,బలస,పేర్లు కూడా తెలియని మరెన్నో జాతుల పండ్లను అడవితల్లి చెంచు పిల్లల కోసం అయా రుతువుల్లో అమర్చి పెట్టె వుంటుంది.కాని నాగరిక ప్రపంచపు దుర్మార్గానికి అడవుల్లోని పళ్ళచెట్లు మయమవుతూ వున్నాయి.లేకపోతే చెంచు పిల్లలు అడవిలో తాము తిన్నన్ని తిని కూడా బయటి సమాజంలోని తమ నేస్తాలకు కూడా వాటిని అందుబాటు(అమ్మకాల ద్వారా)లోకి తెచ్చే వారు.













పచ్చదనపు క్యాన్వా స్ పై ప్రకృతి చిలికిన రంగవళ్ళులలాంటి సీతాకోక చిలుకల వెంట చెంచు పిల్లల పరుగులకు అడ్డు ఆపు వుండదు. ఆపరుగులో గెలిచిన వాడు తాను పట్టిన సీతాకోక చిలుకకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండాదాని రెక్కలపై వుండే బూడిదను వేళ్ళకు పట్టించుకుని నుదుటన వీభూధిలా ధరించి తాను పట్టిన సీతాకోక చిలుకకు స్వేఛ్ఛను ప్రసాదించి,విజయగర్వంతో ముందుకు సాగుతాడు. నల్లమలలోని కొలను భారతి సరస్వతీ క్షేత్రం లో వున్న చారుఘోషిణీ మైదాన ప్రాంతాల వారికి ఇత్తమ గతులను ఇచ్చే తీర్తమే కావచ్చు కానీ ఈ కొండ వాగు మాత్రం చెంచు పిల్లల నల్లని శరీర స్పర్శకు పొంగి పోతుంది. వారిని అప్యాయంగా తడుముతూ మాతృత్వపు తీపిని ఆస్వాదిస్తుంది.కర్నూలు లాంటి నగరాలను వణికించిన తుంగ భద్రమ్మ,కృష్ణమ్మలు సంగమించి నల్లమలలో మహోగ్రంగా ప్రవహించినప్పటికి చెంచు బాలలు సరదా పుట్టి పుట్టిలో నదీ ప్రవేశం చెస్తే వారినే మాత్రం ఇబ్బంది పెట్టకుండా అలలను స్వయం నియంత్రించు కుంటుంది.

పువ్వులాంటి సున్నితత్వం, తూనీగలాంటి స్వేచ్చాప్రియత్వం వున్న చెంచు పిల్లలకు నాలుగు గోడల మద్య నిర్భందంగా విద్య భోదించాలను కుంటే వీలవుతుందా? ప్రస్తుతం నల్లమల చెంచు పిల్లలకు ఇలాంటి అశాస్త్రీయ పద్దతిలోనే ప్రభుత్వం విద్యాసంస్థలను నడుపుతోంది.కొట్లాది రూపాయలు ఖర్చవుతున్నా గత రెండు దశాబ్ధాలలో పది దాటినవారు పది సంఖ్యను ను దాటి వుండరు.