Saturday, February 28, 2009

పీడితజాతి లోంచే వారి విముక్తి వీరుడు ప్రభవిస్తాడు.

గురవడి పేరుచెబితే ఒకప్పుడు నలమల అంచుల్లోని పల్లె జనాలకు వణకు పుట్టేది.దుర్మార్గానికి నిలువెత్తు రూపంగా ప్రచారం కాబడ్డ గురవడు తమను పట్టించుకోని సమాజంపై ఎత్తిన తొలిపిడికిలిగా మనం అర్థంచేసుకోవచ్చు.1930 దశకంలోఅప్పటి కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నల్లకాలువ గ్రామ సమీపంలోని నల్లమలలోని రుద్రకోడు గూడెంలో గురవడు నివసించేవాడు.చెంచుల సహజ రూపానికి భిన్నంగా గురవడు ఆరడుగుల పొడవుండేవాడు.చేతిలో అంబుబద్దతో నడచివస్తుంటే ఎదుటపడడానికి మీసాలు సుళ్ళుతిరిగిన మహమహా రైతులే ధైర్యం చేసేవారు కాదు.దర్జాగా పొలాల్లోకి వచ్చి జొన్నకంకులు,కొర్రలు,ఆరికెలు మోసినన్నిపట్టుకు పోయినాగురవన్నిఇదేమని అడిగే తెంపు ఎవరికి వుండేదికాదు.సాధారణంగాచెంచులుపంటపొలాల్లోదొంగతనంగానో,కళ్ళాలవద్ద అడుక్కునో తిండిగింజలు తీసుక పోయేవారు. అలాంటిది స్వంతచేలోకొచ్చినట్లు వచ్చి అందినకాడికి దొరలా పట్టుకు పోయే గురవడిని ఎదుర్కోలేని అప్పటి పల్లెజనాలు తమ అశక్తతను కప్పి పుచ్చుకునేందుకు అతనికి అతీంద్రియ శక్తులున్నట్లు ప్రచారం చేశారు. ఆడవాల్లను ఎత్తుకు పోయి అత్యాచారానికి పాల్పడే వాడని కూడా ప్రచారం జరిగింది.మొత్తం మీద మైదాన ప్రాంతాలలొ గురువడు ఎలాగైనా హతమార్చాల్సిన రాక్షసుడుగా ప్రచారమయ్యాడు. చెంచులు అప్పుడే కాదు ఇప్పటికి కూడా మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన,వ్యభిచరించిన చరిత్ర లేదు. కానీ చెట్టున కాసిన కాయ,అడవిన పరుగెత్తె జింకలు తన ఆహారంగా దేవుడు ఏర్పాటు చేసినవేనని భావించి,వాటిపై ఇంకోడి పెత్తనమేమిటంటూ ఎవ్వరినీ లెక్క చేయని కారణంగ ఓ చెంచు వీరుడు అందరికి శతృవయ్యాడు.అలాంటి సంధర్భంలో ఓరోజు గురవడు నల్లకాలువ గ్రామానికొచ్చాడు. తనను చూసి బయపడి పక్కకు తప్పు కుంటున్న గ్రామస్తుల పిరికి తనానికి నవ్వుకుంటూ గురవడు సారాయి అంగడి వైపు మల్లాడు.అంగట్లో కూర్చున్న ఈడిగాయన్ను బెదరగొట్టి పూటుగా మందు పుచ్చుకున్నాడు.తూలుతూ చెంచుగూడెం వెళ్ళేందుకు బయలు దేరాడు.గ్రామస్తులకు ఇది సువర్ణావకాశంలా కనిపించింది. అయినా ఎదురువెళ్ళాలంటే ఎవ్వరికైనా అదురే. బలిజ నారాయణ తొలి దెబ్బ వేశేందుకు సిద్దపడ్డాడు. మిగిలినవారు తలొ దిక్కునుండి దాడి చేయడానికి సమాయత్తమ్యారు.బలిజ నారాయణ వెనుకనుండి అనుకునట్లు గానే పట్టుడు కట్టెతో తలపై బలంగా ఒక వేటు వేశాడు.ఓగావు కేక వేసి నేలకూలిన ఆగిరిజన వీరుడిని కమ్ముకున్న తక్కినవారు అతడికి ఊపిరి సలపకుండా వేటుపై వేటు వేస్తు నిర్వీర్యున్ని చేశారు. అయినా గురవడి ప్రాణం పోలేదు. నెత్తుటి ముద్దలా వున్న గురవడి శరీరాన్ని ఎద్దుల బండి చక్రాలకు కట్టి,బండిపై మనుషులెక్కి నడిపించారు. అయినా ప్రాణాలు పోని గురవడు "ఎందుకురా నన్నిలా హింసిస్తారు నాజబ్బలోతాయెత్తులున్నాయి వాటిని తొలగించనంతవరకు నకు చావులేదని తనమరణ రహస్యం తానే వివరించి ప్రాణాలు విడిచాడు. నాటి ఇంగ్లీషు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి ఊరంతాఎదురు తిరగడంతో వారు వెనుదిరిగారు.ఈ జరిగిన కథను ఇప్పటికీ పల్లెజనంవల్లె వేస్తూనే వుంటారు.అలా ఎప్పుడో స్వతంత్రించి వ్యవస్తను లెక్కచేయక తిరగబడ్డ గురవడి జీవితం అలా ముగైసింది.సరిగ్గా మరో 7౦ డెభై సంవత్సరాల తరువాత చట్టబద్దంగా చెంచుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినందుకు మరో చెంచు వీరుడు దాసరి కొండన్నదొంగ ఎదురు కాల్పుల్లో ప్రాణాలు వదలడం యాదృఛికమైతే కాదు.పీడిత వర్గాల నుండేవారి విముక్తి వీరుడు ప్రభవించడం చరిత్ర చెప్పిన పాఠమే.

Friday, February 20, 2009

పేగు తెంచుకు కాదు.. చెంచులు పేగుదంచుకుని పుడతారు

పేగు తెంచుకు కాదు.. చెంచులు పేగుదంచుకుని పుడతారు
నిజం నల్లమలలో చెంచులు పేగుతెంచు్కోవాలంటే వాళ్ళమ్మ పేగు దంచు కోవలసిందే. నిండు గర్భిణులైనా చెంచుతల్లులు, ఆహార సేకరణలో మగనితో పాటు అడవుల వెంటవెళ్ళాల్సిందే.అలాంటప్పుడు నొప్పులువచ్చి కాన్పు ఆయితే పిల్లను తల్లిని కలిపి ఉంచిన పేగుక్రింద ఒక రాయిని పెట్టి,పైన ఇంకో రాయితో మెల్లగా దంచుతూ ఆచెంచు తల్లి పిల్లవాని ప్రేగు తెంచుతుంది.పగలంతా పొలంలో పత్తి ఒడిపి,గోతానికి కుక్కి,ఆగోతం మోసుకు వచ్చి రైతు ఇంట వేసి ఇంటికి వెళ్ళి ప్రసవించే రైతు కూలి తల్లి చెంచుతల్లి దుస్థితిని చూసి అయ్యో అనుకోవచ్చు.కాని నెలనెలా డాక్టరు ప్రర్యవేక్షణలో పొట్టలోని శిశువు బాగోగులు చూస్తు,కాలు కిందపెట్టనీయని భర్త సేవలో(ఆమె కోసం కాకపోయినా వారసుడికోసం)నెలలునింపుకుని నొప్పులొస్తయేమోనన్న భయంతో ఇంజక్షన్ లు వేయించుకునోకాదంటే సిజేరియన్ ద్వారా సుఖప్రసవం(?) పొందే కార్పోరేట్ తల్లులకు మాత్రం చెంచుతల్లి పేగు దంచుడు జుగుప్స కలిగించితీరుతుంది. మానవ సమాజం చెంచులను కనీసం తోటి మనుషులుగా కూడా గుర్తించకపోవడం వల్లే వారు ఇంతటి దయనీయస్తితిలో నేటికి బతుకు(?)తున్నారు.
ప్రపంచాన్ని మారుస్తామని కనీసం వ్యక్తులుగా తమనుతాము మార్చుకోలేని కమ్యూనిస్టులుకాని,మనుషులతో కాదు మతంతోనే మకు పని అనే కాషాయ వీరులుగాని,గరీబీకాదు..గరీబోంకో హఠావో అనే కాంగ్రేస్ వారు కాని ఎవ్వరూ వీరి వంక చూసిందిలేదు. వీరి బతుకుల్లో ఏదన్నా చిరు మార్పు వచ్చిందంటే శర్మ లాంటి ఒకరిద్దరు ఐటిడిఏ అధికారుల వల్లే. వారిలో పెను మార్పును అభివృధ్దిని కోరుకుని ఆమార్గంలో కొంత ముందుకు నడచిన వన దేవతలను(చెంచుల దృష్టిలో) ప్రజాప్రభుత్వం నల్లమలలోనే లేకుండాచేసింది.ఇక ఇప్పుడు చెంచులకు దేవుడే దిక్కను కోవాలేమో. సిరికింజెప్పక.. శంఖచక్రగధాయుధంబుల కైదోయి సధింపకనే ...నేకుగా అర్తరక్షణకు బయలుదేరడానికి చెంచులలాగే వాళ్ళదేవుల్లు అణగారినవారే. ఈదన్న,ఈరడు మంతనాలమ్మ మొదలయిన వారి దేవతలకు చెంచులు ఏనాడు దూపదీప నైవేద్యమ్ముల నందించిందిలేదు, వారు వీరికి అభయమిచ్చి అదుకుంది లేదు.

Wednesday, February 18, 2009

చెంచులను జంతువుల్లా వేటాడిన ఖాకీలు ... నల్లమల చెంచులు నేడు గాయపడ్డ లేడి కూనలు

వంద కోట్లకు పైబడిన భారత జనాభాలెక్కల్లో తామూ అంకెలమేనని పాపం నల్లమల చెంచులకు తెలియదు.సౌకర్యవంతంగా, స్వేఛ్ఛగా, గౌరవంగా బతికే పౌరహక్కులున్నట్లు వారి కసలే తెలియదు.పొద్దు పొడిచింది మొదలు అడవుల్లో తిరుగుతూ ఆపూటకేది దొరికితేఅది తింటు దొరక్కపోతే పస్తులుండే నిర్భాగ్యపు బతుకులు చెంచులవి.మండే కడుపులో మంట చల్లార్చుకునేందుకు చెంచులు యాప(వేప కాదు) బెరుడును కాల్చి బూడిద చేసి ఆ బూడిదను బాగా తడిపి అందులో చింత పండుకలుపు కుని తింటూ వుంటారు. దీంతో కడుపు మంట చల్లారడమేమో గాని విరేచనాలు పట్టుకుని ఆ అమాయకులు మృత్యు ముఖానికి చేరుకుంటుంటారు. అలాంటి చెంచులు అడవుల్లో అన్నలతో మాట్లాడారనో,వారికి వుపయోగపడారనో పోలీసుల చేత చిత్రహింసల పాలైయ్యారు.అప్పుడప్పుడు బూటకపు ఎన్ కౌంటర్లకు బలవుతూనే వున్నారు. పెచ్చెరువు చెంచు గూడెం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి సుమారు యాభై కిమీ దూరంలో నడి నల్లమలలో ఉంటుంది.అక్షరం ముక్కరాని చెంచుజాతిలో ఆ గూడేనికి చెందిన దాసరి కొడన్న పదవతరగతి వరకు చదవడమంటే గొప్పే. గూడెంలో చౌకధరల దుకాణం నడుపుకునే కొండన్న అటు గూడెం లోను,ఇటు ఆత్మకూరు పట్టణంలోను అందరికి తలలోని నాల్కలాంటివాడు. అడవిలో దారి తప్పిన ఫారెస్టోల్లకైన, పొలపర్లకైనా(కట్టెలు కొట్టుకుని బతికేవారు) కొండన్న నే ఆఅడవిలో అన్నదాత.ఒక్కోసారి అన్నలవేటలో వున్నపోలీసులు బల్వంతంగానైనా కొండన్న ఆతిధ్యం పొందేవారు. అలాగే అన్నలకు అప్పుడప్పుడు అన్నం పెట్టేవాడు.పారెస్టోడో, ఐటిడిఏ వాడో చెంచులకు కించిత్ అఅన్యాయం చేసినా వెంటనే ఆత్మకూరు పట్టణంలోని విలేఖరులకు చేరవేశేవాడు. నెలలునెలలు తన తోటి చెంచులు డబ్బులు ఇవ్వక పోయినా వారికి బియ్యం వుద్దరుగా వేశేవాడు. వారికి వీలు కుదిరి అటవి ఫలసాయం బాగా లభించి వారికి డబ్బులు వచ్చేవరకు వేచి వుండేవాడు.ఎప్పుడు తన జాతి జనం ఎలాబాగు పడతారా అనిమాత్రమే ఆలోచించేవాడు.ఓసారి వరస కరువులొచ్చి గ్రామాల్లోని రైతులే కూడులేక అల్లాడిన రోజులవి.అప్పుడు అడవిలో చెంచులస్థితి మరింత దారుణంగా వుంది. ఈ స్థితిలో కొండన్న వెయ్యి మంది చెంచులను సమీకరించి శ్రీశైలం ఐటిడిఏ కార్యాలయం ముందు ఆకలి ప్రదర్శన నిర్వహించాడు. ప్రతి చెంచు కుటుంబానికి రెండు బస్తాల బియ్యము,బస్తా జొన్నలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటి ఐటిడిఎ పిఒ వాడ్రేవు చినవీరభధ్రుడు ఈ డిమాండ్ ను ఆమోదించ లేదు. ఈస్థితిలో చెంచులకు ఆకలి చావు అనివార్యమయింది. దీన్ని నివారించేందుకు అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వం చెంచులకు ఇంటికి బస్తా బియ్యం,బస్తాజొన్నలు ఇవ్వాలని నిర్నయించి అమలు చేయడం కొండన్నకు ప్రాణాంతకంగా మారింది. ఈవ్యవహారంతో కొండన్న పీపుల్స్ వార్ పార్టీ సన్నిహితుడుగా పోలీసులు అనుమానించారు. ఆరోజుల్లొ పోలీసులకు అనుమానం వచ్చిందంటే చాలు ఆజీవికి భూమి మీద నూకలు చెల్లినట్లే. అంగటి సరుకులు కొనడానికి కొండన్న ఒకరోజు ఆత్మకూరుకు వచ్చాడు. పనిలొపనిగా షేవింగ్ చేయించుకుందామని ఓ సెలూన్ లో కూర్చున్నాడు.ఇంతలో ఎవరో ఓ వ్యక్తి సిఐ పిలుస్తున్నాడంటు కొండన్నను పోలీసుస్టేషన్ కు తీసుకు పోయాడు.అంతే ఆ మరుసటి రోజు తెల్లవారు ఝామున పోలీసులకు నక్సలైట్లకు నడుమ జరిగిన ఎదురు కాల్పుల్లో గుర్తుతెలియని ఓ నక్సలైట్ మరణించాడని పోలీసులు చేసిన ప్రకటన వచ్చింది. అప్పటికే ఆందోళనలొ వున్న కొండన్న బంధువులు సంఘటనా స్థలానికి వెల్లగా అక్కడ నెత్తుటి మడుగులో కొండన్న శవం కనిపించింది. ఆహార సేకరణదశ దాటని ఓ ఆదిమ తెగలో సమాజ గతిని అర్థం చేసుకుని తన జాతికొక దిశను చూపాలనుకున్న మనిషిని రాజ్యం కౄరంగా హ్త్య చేసింది. ఇలాంటి సంఘటనల వల్లే చెంచులు తమ కోసం ఎవరో వస్తారని ఎదురు చూసే స్థితికి చేరు కున్నారు. కొండన్న ఒకడే కాడు కొంత తార్కికజ్నానం అలవడిన చెంచులెందరో రాజ్యయంత్రం ఇనుప కాళ్ళాకింద నలిగి పోయారు. ఇలాంటి దశలో చెంచును ప్రగతి వైపు తీసుకు పోయేదెవరు.

Tuesday, February 17, 2009

చదువు సాగదు...బతుకు మారదు

అపుడెప్పుడో వినేవాళ్ళం.చెంచు రేంజర్ అని, చెంచు ఫారెష్టరని.అంటే తెల్లవాడి పాలనలో కొదరు చెంచులకు చదువబ్బిందని అర్థమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 6దశాబ్దాలు గడచినా నాలుగు జిల్లాలలోని అన్నిచెంచు గూడేలు పరికించి చూసినా పదవ తరగతి పాసైన చెంచు బాలుడు ఒక్కడు కనిపించడు.ఇటీవల ప్రారంభమైన రామచంద్రమూర్తి hmtv కోసం చెంచు జాతికి చెందిన రిపోర్టర్ కోసం వెదికారు. కనీసం టెంత్ పాసైతేచాలు అంతానేర్పించు కుంటామని రామ్మోహన్ గారు అక్కడక్కడా వాకబు చేశారు.ఎంతో వెతుకులాట తరువాత ఒ అబ్బాయి దొరికాడు. అతడి తండ్రి కి ఎలాగో కాస్త అక్షర జ్నానం రాగా అటవీ శాఖలో చిరు ఉద్యోగ చేయడం ద్వారా కొడుకును చదివించుకో గలిగాడు. ఇదీ చెంచుల్లో విద్యాపరిస్థితి.మరి ప్రభుత్వమేం చేస్తోంది అన్న అనుమానం మీకు కలగవచ్చు. చెంచుల అభివృధ్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీ ITDA ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలలో దాదాపు 200 వివిధ స్తాయిల్లోని పాఠశాలలు ఉన్నాయి.శ్రీశైలంలో ఒ పాలిటెక్నికల్ కళాశాళ కూడా వుంది. సమీకృత గిరిజన వసతి గృహాలున్నాయి.ఇన్ని వున్నా మరి చెంచులకు చదువెందుకబ్బదు.ప్రభుత్వ అధికారులలోని చిత్తశుద్ది లోపం,అవినీతి ఇందుకు కారణాలుగా భావించ వచ్చును. అయితే ప్రధాన కారణం మాత్రం విద్యాభోధనలో అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానమే అని చెప్పవచ్చు. చెంచులు ప్రకృతి మాత ముద్దుబిడ్డలు.చెట్లవెంట,పుట్టలవెంటతిరుగుతూనే పెరిగి పెద్దవారవుతారు. అలాంటివారిని నాలుగు గోడల మధ్య బంధించి బెత్తాలతో బెదిరిస్తె సున్నిత మనస్కులై చెంచులకు రుచిస్తుందా. ఇక్కడా అదే జరిగింది.కడుపునిండా తిండి లేని చెంచులపిల్లలు అన్నం వేళల లో మాత్రమే హాస్టల్ల వైపు పరుగులు తీస్తారు. "శామీ బువ్వపేట్టు..." అంటూ తమ అన్నాన్ని తామే అడుక్కుంటుంటారు.పై మీద చింకిపాత తప్ప ఈ చెంచుపిల్లగాళ్ళు వేరెరుగరు. అయితే ఇటిడిఎ లో పని చేసే ఏచిన్న ఉద్యోగి పిల్లలైనా సరే సీతాకోక చిలుకల్లా రంగురంగుల యూనిఫాం లలో పట్టణాలలోని ప్రవేటు కాన్వెంట్లకు వెళుతూ కనిపిస్తారు.పెద్దపిల్లలయితే పల్సరు బండ్లపై తప్ప కాలు కింద మోపరు.వీళ్ళకు ఈ సొమ్మంతా చెంచుల పేర జమ రాసుకుని బొక్కిన సొమ్మేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. చెంచు పిల్లలను వెంట బెట్టుకుని కొండల్లో తిరుగుతూ చెట్టు పుట్టాచూపుతూ ప్రకృతిపరంగా చెప్పాల్సిన విధ్య రొడ్డకొట్టుడుగా మారడం విచారకరం. తెలుగు పత్రికలు చదివేవారికి వాడ్రేవు చిన వీరభధ్రుడు తెలిసేవుంటారు.అభ్యుదయవాదిగా,సున్నిత మనస్కుడిగా ఆయన రచనల ద్వారా మనకర్థమవుతారు.ఆయన కూడా చెంచుల కోసం ఏర్పాటు చేసిన శ్రీశైలం ఇటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా పని చేసి వుండడం కొసమెరుపు.

Sunday, February 15, 2009

చెంచు జాతి హననాన్ని వేగవంతం చేసిన అభయారణ్యం----------------------------------------------------------------------ఎప్పుడో ఏకాలం నాడో ఓ తమిళుడు పచ్చటి శోభతో వెలుగుతున్న ఆ కొండలను చూసి "నల్లమలై"(మంచి కొండలు) అన్నాడు. అలా నామకరణం గావించ బడ్డ నల్లమలలు అధ్బుత మైన ప్రకృతి రమణీయతకు నేటికీ చిరునామాగా వుంటూ ఉన్నాయి.వేలాది చ.కిమీ పరిధిలొ విస్తరించిన ఈ అడవులు జీవవైవిధ్యానికి(Bio diversity) పెట్టింది పేరు.ఇక్కడ వున్నన్ని వృక్షజాతులు,జంతుజాలము,వనమూలికలు,క్రిమి కీటకాలు మరెక్కడా కనిపించవు. సింహము,ఏనుగు తప్ప వన్యజీవులైన అన్ని స్థన్యజీవులు నల్లమలలొ వుండడం విశేషం.
దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ బెంగాల్ టైగర్లకు నల్లమలలోనే అభయారణ్యం ఏర్పాటు చేశారు.కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దాటిన తరువాత kgరోడ్డు కు ఎడమవైపు మొదలైయ్యే నల్లమల అడవి అలాగే కృష్ణాతీరం దాటి ఆవలి ఒడ్డున వున్న మహబూబ్ నగర్ జిల్లాలోని అడవిని కలుపుకుని వేలాది చ.కి.మీ మేరా "శ్రీశైలం- నాగార్జునసాగర్" వైల్డ్ లైఫ్ సాంక్చురీ పేరుపై ఈ అభయారణ్యం ఏర్పాటైయింది. నిజానికి పులిని పర్యావరణ సూచిగా భావించవచ్చు. పులి కదలికలు,పునరుత్పత్తి,జననరేటు తదితర అంశాలు అడవి లోని మిగిలిన జంతుజాల జీవన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది.పులి దాదాపు నలభై చ.కి.మి పరిధిలో ఆధిపత్యం వహిస్తుంది.పర్యావరణ శాస్త్రవేత్తలు అడవిని మూడు ప్రధాన జోన్ల్ గా విభజిస్తారు.అవి 1.టూరిస్ట్ జోన్(జనం తమ అవసరాల కోసం తిరుగాడే గ్రామాల సమీపంలో వుండే అడవి ప్రవేశ ప్రాంతం)2.బఫర్ జోన్(గడ్డి మేసే జంతువులు తిరుగాడే ప్రదేశం)3.కోర్ జోన్( అడవి మద్యభాగము(జనసంచారంలేని దట్టమైన చోటు) పెద్దపులి కోర్ జోన్లో తన టెరటరీని స్తాపించుకుంటుంది.పులి మనుషులకు ఎప్పుడు హానికారిణి కాదు.అడవిలో పులిని మనిషి ఒకసారి చూస్తె పులి మనిషిని వేయి సార్లు చూసి ఉంటుందని జానపదుల సామెత.మనిషిని చూస్తె తప్పుకునే స్వభావం పులిలో ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ మనిషే పులిపాలిట యమదూతగామారి, వాటి సంఖ్య దారుణంగా పడిపోవాడానికి కారణమవుతున్నాడు.అయితే చిత్రంగా వేల సంవత్సరాలుగా అదే నల్లమలలో పులులతో సహజీవనం చేస్తున్న చెంచులు మాత్రం పులులకు ఏనాడూ కీడు తలపెట్టడం కానీ పులులు చెంచుల మీద దాడి చేసిన సంఘటన కానీ రికార్డు కాలేదు. మీదు మిక్కిలి మైదాన ప్రాంతాల నుండి అడవిలోనికి వేటకు వచ్చే వారిని చెంచులు తరిమి కొట్టిన సంధర్భాలు కూడా వున్నాయి. నల్లమలలో వున్న పురాతన ఆలయాలను గుప్త నిధుల వేటగాళ్ళ నుండి ఎన్నోమార్లు కాపాడిన ఘనత చెంచులకు వుంది. అయినప్పటికీ ప్రభుత్వం పులుల అభయారణ్యం కోసం చెంచులను వారి సహజ ఆవాసాలకు దూరంగా పునరావాసం పేరిట తరిమి వేసింది. అసలే జన్యు వైవిధ్యం లేక ,పౌష్టికాహార లోపం వల్ల చెంచుజాతి వేగంగా క్షీణించి పోతోంది. అలాంటి విలుప్తమవబోతున్న జాతిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అశాస్త్రీయంగా పులుల సంరక్షణ పేరిట వారు మరింత వేగంగా నశించి పోయే పునరావాస ప్యాకేజ్ కి పాల్పడింది. తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో చెంచులు తిరిగి అడవిలోనికి ప్రవేశించారు. తమదైన అడవిలొ నేడు వారంతా తమది కాని బతుకు బతుకు తున్నారు.

Tuesday, February 10, 2009

చెంచుల ఆశాకిరణం పొడిచింది... అస్తమించింది______________________________________________________________________నల్లమల చెంచులు అడవి లోని జంతువుల కంటె హీనంగా బతుకుతూ, చెదలుకంటే కనాకష్టంగా బతుకు ముగిస్తున్న విషయం ముందు రాసిన పోస్టులలో చూసాము. చీకటి మయమైన వారి జీవితాల్లోకి కూడాకొంత వెలుగు వచ్చినప్పటికీ అది మెరుపులా మాయమైయింది.ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఉత్తర తెలంగాణాలొ ముమ్మరమైన అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం క్రమానుగతంగా దక్షిణ తెలంగాణా లో పాదుకుంటున్న సమయంలోనే అనివార్యంగా ఆ పార్టీ సాయుధ కార్యకర్తలు నల్లమలలోకి ప్రవేశించారు. మొదట మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాలలొ ప్రవేశించిన వీరు ఆతరువాత గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాలలొని నల్లమల అడవులను తమకు రక్షణ దుర్గాలుగా మలుచుకున్నారు.అప్పటికి ఖాకీ రంగు దుస్తులు ధరించి తమను గొడ్లను బాధినట్లు బాదిన మలబారు పోలీసుల(తెలంగాణ సాయుధ పోరాట కాలం) గురించి,తాము పొలాల్లో జొన్న కంకులో,వడ్లగింజలో తెచ్చుకోను పోతే చావచితక్కొట్టిన తెల్ల బట్టల రైతుల గురించి మాత్రమే తెలిసిన చెంచులకు ఆలివ్ గ్రీన్ రంగు దుస్తుల్లో మెరిసి పోతున్న సాయుధులు మొదట వింతగానే కనిపించారు.వారు ధరించిన దుస్తుల్లో తేడా వున్నట్లే వారి ప్రవర్తనలో తేడాను కూడా అడవి బిడ్డలు పసిగట్టారు.అప్పటి నుండి ఏ చెంచు గూడేనికైనా దళం వచ్చిందంటె చాలు కడుపు నొప్పి నుండి జ్వరాలదాకా బీమారీ ఏదైనా సరే చెంచులు అన్నలనే ఆశ్రయించేవారు. దళం డాక్టరు కూడా తన పరిమితి మేరకు కిట్ లో వున్న మందులతో వారికి వైద్యం చేసేవాడు.అన్నలు గూడేలలో చదువులు చెప్పేవారు. ఈ క్రమంలోనే శుభ్రత, ఆరోగ్య సూత్రాలను పాటించడం కూడా వారికి అన్నలు వంట బట్టించారు. అయినప్పటికి చెంచులు తాగుడును మానుకోలేక పోవడం వారి అభివృధ్దికి ఆటంకంగా మారింది. కడుపుకు తినే తిండిని ముట్టుకుంటే రైతులు ఎందుకు వెంటపడి తరిమితరిమి కొడతారో అర్థం కాని చెంచులకు వారి లాగా తామూ పంటలు పండించాలని ఆశపడేవారు. ఐటిడిఏ వాళ్ళు అప్పుడప్పుడు ఎద్దులు ఇప్పిస్తామంటూ పట్టణాలకు తీసుకు వెళ్ళినపుడు అక్కడ కనిపించిన ఎద్దులన్నీ తమవయితె బాగుండని వారి కనిపించేది. కానీ ఫోటోల వరకే అవి తమతో వుండేవి.ఆతరువాత తాగడాని బ్రోకర్లు ఇచ్చే డబ్బులు తమను మైకంలో ముంచి తేల్చేసరికి అవి మళ్ళీ కనిపించేవి కావు. వ్యవసాయం చెంచులకు ఎప్పుడు ఫలించని స్వప్నంగానే వుండేది. అందుకే అన్నలు చెంచులకు సేద్యం మీద వుండే మక్కువను వుపయోగించి వారిని మద్యపానానికి దూరం చేసే పని మొదలు పెట్టారు. గూడెమంతా ఓ కట్టుబాటుకు వచ్చి సామూహికంగా మద్యపాన నిషేధం పాటిస్తే ఆగూడేనికి వ్యవసాయం నేర్పేందుకు పీపుల్స్ వార్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకు అవసరమైన భూమి తయారు చేయడంతో పాటు ఎద్దులు, పెట్టుబడి అంతా వారే సమకూర్చేవారు.మైదాన ప్రాంతాల నుండి రైతులను పిలిపించి చెంచులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పించేవారు.అప్పటికే వ్యవసాయంలో కొంత జ్నానం సంపాదించిన మహబూబ్ నగర్,ప్రకాశం జిల్లాలలోని చెంచులతో పాటు కర్నూలు పరిధిలోని నల్లమల చెంచులు తమ జీవన పరిణామ క్రమంలో వేల సంవత్సరాలుగా జరగని మార్పును ఇలా ఒక్కసారిగా పొందారు. ఈక్రమంలో ఎంతోమంది చెంచులు ఉద్యమాలలోకి కూడా వెళ్ళారు.అప్పటికే పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచుతున్న రాజ్యానికి మత్తుకు దూరంగా పచ్చగా కనపడే చెంచు గూడేలు ఉద్యమ ప్రాంతాలుగా కనిపించ సాగాయి.దీంతో తాగని ప్రతి చెంచు, ఓ నక్సలైట్ గాను, వ్యవసాయం చేసుకునే గూడేలు విముక్తి ప్రాంతాలుగా కనిపించ సాగాయి.అడవి బిడ్డలు ఘోరమైన రాజ్య హింసకు గురయ్యారు.తాగని చెంచుకు తన్నులు నిత్యకృత్యమయ్యింది.అన్నలు గూడేల వైపునే కాదు నల్లమలలోనే లేకుండా చేయడంలో రాజ్యం సఫలీకృతమయ్యింది. నేడు తిరిగి నల్లమలలో మట్టిగొట్టుకుని పడివున్న చెంచులు మన కళ్ళకు కనిపిస్తారు. బక్కచిక్కిన శరీరాలతో కళ్ళళ్ళో ప్రాణాలు నిలుపుకుని ఎవరి రాకకోసమో ఎదురుచూస్తు నేలకు కర్చుకుని వున్నారు. వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు మరింత జోరుగా వారి పేరున పద్దులు రాసి కోట్లాది రూపాయలను కైంకర్యం చేస్తూ ఉన్నాయి.