Wednesday, April 15, 2009

ఇన్నాళ్ళకు చెంచులు ఓటర్లుగానైనా కనిపించారు.

ముందు రాసిన పోస్టులలో నల్లమల చెంచు గూడెం పెచ్చెరువు గురించి ప్రస్తావించి ఉన్నాను.దాదాపు మూడు దశాభ్దాల కిందట పులుల అభయారణ్యం కోసం అడవి నుండి ఖాళీ చేయించబడ్డ గిరిజన గ్రామమది.అడవిలోని ఆగూడెం అలా రెవెన్యూ రికార్డులనుండి మాయమైంది.మైదాన ప్రాంతలోని పునరావాసం ఒంటని చెంచులు తిరిగి అప్పుడే తమ పాత స్థలానికి తిరిగి చేరు కున్నారు.అప్పటి నుండి పెచ్చెరువు చెంచులు అటవీ ఫలసాయం అమ్ముకోవాలన్నా చౌకధరల దుఖాణం వెళ్ళాలన్న నలభై కిమీ నడచి వెళ్ళాల్సి వచ్చేది. అలాగే ఓట్ల కోసం కూడా వారికి ఇదే శ్రమ తప్పేది కాదు. కాకపోతే మరో పూట గురించి ఆలోచించుకోలేని ఆ అడవి బిడ్డలకు ఓట్లు ఎప్పుడు అంత అవసరమైన విషయాలుగా కనిపించేవి కావు.జనాభా లెక్కలకే ఎక్కలేని వారు వోటరు జాబితాకు మాత్రం ఎలా అతుకు తారు. కాగా ఇన్నేళ్ళ తరువాత లెక్కాధాఖలు లేని అటవి గ్రామంలో నివశిస్తున్న చెంచులకు ఓటు యోగం పట్టింది.పట్టుమంటే పాతిక మంది లేని ఆచెంచు గూడెంలో ఎన్నికల కమీషన్ పోలింగ్ బూతు పెట్టబోతోంది.నల్లమలను మావోయిస్టులు లేని ప్రాంతంగా చేశామని ప్రకటించు కొనడంలో భాగంగానే ఈ ఏర్పాటు జరిగినట్టుంది.నట్ట నడిమి నల్లమలలో ఎన్నికలు జరిపించ గలిగామన్న కీర్తి కండూతి అధికారులను ఇందుకు పురిగొల్పి ఉండవచ్చు.ఇరవై మందితో ఓట్లు వేయించుకునేందుకు రెండు వందల మంది పోలీసులనుఇందుకు వినియోగించు కోనున్నారు. ఇవిఎంలను తరలించేందుకు అవసరమైతే హెలికాఫ్టర్ ను ఉపయోగించేందుకు ప్రభుత్వం వెనుకాడక పోవచ్చు.చింతపండును బూడిదలో కలుపుకుని నీళ్ళుపోసి ముద్దచేసుకుని తిని కడుపు నింపుకున్న నాడు అదే చెంచులకు పట్టెడు కరవు బియ్యం అందించలేని వారు నేడు పయిమీద ఇంత బట్టలేని చెంచులతో వోట్లు వేయించేందుకు ఇంత కష్టపడుతూంటే అనుమానం రాకపోతే మనబుర్రలను ఓవర్ హాలింగ్ చేయించుకోవాల్సిందే. కేవలం క్షయలాంటి జబ్బులకే చెంచులు చస్తుంటే పలకరించే దిక్కులేని ప్రభుత్వాలు హెలికాప్టర్ ను ఉపయోగించి ఎన్నికలు జరపాలను కోవడం వెనుక పాలక వర్గ రాజకీయ ఎత్తుగడ ఏది ఉండదనుకోవడం మన అమాయకత్వం కాక మరేమిటి.

Friday, March 20, 2009

ఆడబతుకు అడవిలోకూడా అన్దతుకె

ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని అంటూఉంటారు.మరి అడవిలోనే పుట్టిన ఆడవాళ్ళ భాధలుఇంకెంత ధారుణంగా ఉన్నాయో కాస్త పరికించండి. తైల సంస్కారమంటే ఏమిటో ఏమో తెలియని జుట్టు,శుచి,శుబ్రత ఎరగని ఒళ్ళు,కాకి పీకడానికి కూడా లేని కండ,ఉతుకు లేని ఉడుపులు ఇది నల్లమలలో నివశించే చెంచు మహిళ ఆకారాధి విశేషాలు.ఇంతటి దీన స్థితిలో ఉన్న చెంచు మహిళ పట్ల కూడా కొందరికి కోరిక కలగడం పైశాచకత్వం కాక మరేమిటి.నాగరికులని పిలువబడే చెంచులు ఎప్పుడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన చరిత్రలేదు. కాని నాగరికులమని జబ్బలు చరుచుకునే వారెందరో చెంచు మహిళలపై పాల్పడిన అత్యాచారాలు అన్నిఇన్ని కావు. అందమైన నల్లమల ప్రాత:సంధ్యా సౌందర్యాన్ని తన హాండీకాంలో చిత్రిస్తున్నాడో సౌందర్యారాధకుడు. ఓపొద చాటున అలజడేదో వ్యూపైండర్ లో అతనికి కనిపించింది.జాగ్రత్తగా చూస్తే బక్క చిక్కిన ఓ చెంచు మహిళను సాయుధుడొకడు బెదిరిస్తూ పొదచాటుకు తీసుకు వెల్తున్న దృశ్యం అతడి కంట పడింది. చెట్టుపై ఉన్న తను కెమెరాను మరింత ఝూం చేసి పులిలా వేటాడి లేడిని పీక్కుతింటున్నట్లున్న ఆభీభత్స దృశ్యాన్ని ఆసాంతం జాగ్రత్తగా చిత్రీకరించాడు.మావోయిస్టుల ఏరివేతకోసం అడవిలోకి వచ్చిన గ్రేహౌండు కూంబింగ్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ ఘాతుకం అలా రికార్డ్ చేయబడింది. నలమలలోని పెచ్చెరువు చెంచు గూడెం పరిసరాల్లో జరిగిన యదార్థ సంఘటన ఇది.ఇంతటి ఘోరానికి సాక్షి అయిన వ్యక్తి ఓ స్వచ్చంద సంస్థకు చెందిన వైద్యుడు.అతడు తన మిత్రుడైన ఓ ప్రముఖ చానల్ విలేఖరి ద్వారా అప్పటి నంద్యాల osd కి తన సజీవ సాక్ష్యాన్ని అమ్ముకోవడం జరిగింది. కర్నూలు లో ప్రజాశక్తిలో పనిచేసిన ఓ మహిళా విలేకరికి ఈవిషయాలు కర్ణాకర్ణిగా తెలిసి విషయ సేకరణకు ఈ బ్లాగరుతో కలిసి ప్రయత్నించినా సాధ్యపడలేదు. అలా నల్లమల చెంచు మహిళపై ఓమానవ మృగం చేసిన అత్యాచారం వెలుగులోకి రాకుండా పూడ్చిపెట్టబడింది.ఇలాంటిదే మరో సంఘటన ప్రకాశం జిల్లా పరిధిలోని బందంభావి చెంచు గూడెంలోజరిగింది. అటవీ ఫలసాయం సేకరణ కోసం ఓ చెంచు దంపతులు అడవిలోకి వెల్లారు. అక్కడ వీరికి కూంబింగ్ పోలీసులు తారసపడ్డారు. వారు ఆచెంచు మిధునాన్నిఅన్నల జాడకోసం చిత్రహింసల పాలు చేశారు.ఆపై ఆ చెంచితను భర్తముందే సామూహిక మానభంగం చేశారు. కొసప్రాణాలతో బయటబడ్డ వారు గట్టిగా రోధించే సాహసం కూడా చేయలేక పోయారు. అయినప్పటికి విషయం ఆనోటా ఈనోటా పడి బాహ్య ప్రపంచం దృష్టిలో పడింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజా సంఘాలపై గిరిజనులను అవమానపరచారంటూ పోలీసులూ ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తిరుగమళ్ళ కేసులు నమోదుచేయడం ఓ విడ్డూరం. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో వుండే చెంచు గూడెం నాగలూటి. అక్కడికి వెంకటాపురం గ్రామం సమీపంలోనిదే. ఈగ్రామానికి చెందిన రమణారెడ్డి అనే యువకుడు ఓరోజు నాటిసారా తాగడానికి చెంచు గూడెం వెళ్ళాడు. ఫూటుగాతాగిన రమణారెడ్డి ఉఛ్ఛం నీచం మరచి 50సంవత్సరాల చెంచు పోతమ్మను దారుణంగా మానభంగం చేశాడు. ఆ సమయంలో పొతమ్మ పక్షవాతం వల్ల ఒక కాలు,చేయి పనిచేయై స్థితిలో గుడిసెలో పడిపోయి వుంది. అప్పట్లో ఆంద్రప్రధేశ్ పౌరహక్కుల సంఘం క్రియాశీలంగా వ్యవహరించడంతో పోలీసులు కేసునమోదు చేసి రమణారెడ్డిని జైలుకంపారు. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం కూడా ఇచ్చింది. నల్లమల అడవిపుత్రికలు ఇలా మగమృగాల భారిన పడుతూనే ఉన్నారు. పైన ప్రస్తావించినవి మచ్చుకు కొన్ని మాత్రమే.

Friday, March 6, 2009

ప్రశ్నించిన వాడికి అంతిమ సంస్కారంపట్టించుకోని వాడికి అకాడమీ పురస్కారం

ఇది నిజం. ఇది కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనిపిస్తూ వినపడు తున్నచరిత్ర సవ్వడి .

’కరువు దెబ్బకు ఆకలి చావులతో పిట్టల్లా రాలిపోతున్నఅడవి బిడ్డలను ఆదుకునే భాద్యత నీది కాదా’ అని ఆ అధికారిని ధిక్కారంగా ప్రశ్నించిందొక స్వరం. ’మాపేరుతో కోట్లు బొక్కి తింటున్నారు.. చావుబతుకుల మద్య ఉన్నమావాల్లకు పిడికెడు బువ్వ పెట్టేందుకు కూడా మీకు మనసు రాదా..’ ఆవేదనను ద్వనించిందొక అడవి కోయిల.మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని భాద్యత గల ఆఅధికారి పట్టించుకోకుండా వెళ్ళి పోయాడు. తను పుట్టిన జాతిపట్ల అధికారి చూపిన నిర్లక్షం ఆచెంచు యువకుడి కడుపు మండించింది.తనతోటి మనుషుల పట్ల పౌర సమాజం ఎందుకింత భాద్యతారాహిత్యంగా వుంటుందో అర్థంచేసుకునే ప్రయత్నం చేశాడు అక్కడి మరో యువకుడు. పై సంఘటణ జరిగి నేటికి సుమారు ఎనిమిది సంవత్సరాలైయింది. నాలుగు రోజుల కిందట కేంద్రప్రభుత్వం ప్రముఖ సాహితివేత్త వాడ్రేవు చినవీరభధ్రుడు రాసిన ఓ రచనకు సాహిత్య అకాడమి అవార్డు ప్రధానం చేసింది. ఆయన ఎవరో కాదు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ(ITDA)ప్రాజెక్ట్ అధికారి. పైన పేర్కొన్న సఘటన జరిగిన సంధర్బంలో పట్టించుకోని అధికారి ఆయనే. శ్రీశైలంలో ITDA కార్యాలయం ముందు వేయి మంది కరువు పీడిత చెంచుల సమక్షంలో వీరబద్రుడును ప్రశ్నించిన యువకులు ఒకరు చెంచు దాసరి కొడన్నకాగా,మరొకరు చెంచుల పట్ల సామాజిక భాద్యతను పాటించిన మైదాన ప్రాంత యువకుడు గొల్ల ఆంజనేయులు. వీరిరువురు ప్రస్తుతం బతికిలేరు. వారు బతకడమ్ చాతకాని వారేమి కాదు,వారిని బతకనీయకూడదని రాజ్యం భావించింది.నల్లమలలో రెండు వేరువేరు సంఘటన్లలో వారిరువురిని రాజ్యం ఎన్ కౌంటర్ పేరిట హత్య చేసింది. వరస కరువులతో అన్నదాతలైన రైతులే అల్లాడి పోతూ వుంటే ప్రతి రోజు అడవిన పడి తిరిగి ఆహారసేకరణ చేసుకునే నలమల చెంచుల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది.ఎవరో ఒకరు ఆదుకోక పోతే వారికి ఆకలిచావులు తప్పని పరిస్థితి. దీంతో అప్పటికే రైతు కూలి ఉద్యమాలలో తలమునకలై ఉన్న చదువుకున్న యువకుడు అంజనేయులు,నిత్యం తనజాతి జనులను ఎలా కాపాడు కోవాలా అని ఆలోచిస్తూ ఉండె దాసరి చెంచు కొడన్నలు మరికొందరు ప్రగతిశీల యువకులతో కలిసి శ్రీశైలంలోని ITDA కార్యాలయం ముందు ధర్నా చేసి చెంచుల సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు పోవాలనుకున్నారు.ఈ కార్యక్రమానికి కనీసం వేయి మందిబాధిత చెంచులను తరలించాలని భావించారు. అంతా అనుకున్నట్లే జరిగింది.అగ్నిగుండంలా మండుతున్న ఏప్రియల్ నెల సూర్య ప్రతాపానికి మగ్గిపోతున్న చెంచులతో మాట్లాడడానికి పరమ మానవతావాదిగా సాహితీ ప్రపంచంలో పేరొందిన వీరభద్రుడికి మనస్కరించలేదు.ఎట్టకేలకు చెంచుల పోరాట పటిమకు వీరభద్రుడు దిగివచ్చాడు. తనరచనలలో అపారమైన మానవీయతను గిరిజనుల పట్ల చూపించే ఆయన వారి సమస్యలు వినలేదు సరికదాకూడా ఏకవచన,దూషన పదజాలంతో కించపరచాడు.ప్రభుత్వ గిరిజన స్టోరు డీలరువై ఉండిఇలాచేస్తావా అంటూ తాను మరచిన భాద్యతను కొండన్నకు గుర్తుచేశాడు. కొండల్లోని చెంచుల తరఫున మాట్లాడడానికి గ్రామానికి చెందిన నీకేం అర్హత ఉందంటూ ఆంజనేయులును బెదరగొట్టాడు.ఎన్నిచెప్పినా చెంచుల్కు సాయంచేయడానికి ససేమిరా అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. అలా ఆనాడు ప్రజల సొమ్ముతో బతుకుతూ వారి సంక్షేమం పట్ల ఏమాత్రం భాద్యత పడని వీరభద్రుడికి సాహిత్యంలో మానవీయ విలువలను పాదుకొల్పినందుకు కేద్రప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డ్ ఇవ్వడం రాజ్యం మానవత్వం మీద వేసిన క్శూరమైన జోకు. ఇలా చెంచుల భాధలకు స్పందించిన కొడన్న, అంజనేయులులు పోలీసుతూటలకు బలి కాగా,బాద్యత మరచిన వీరభద్రుడికి అకాడమి పురస్కారం లభిందడం కుళ్ళిన సమాజపు కంపును ప్రదర్సిస్తోంది

Saturday, February 28, 2009

పీడితజాతి లోంచే వారి విముక్తి వీరుడు ప్రభవిస్తాడు.

గురవడి పేరుచెబితే ఒకప్పుడు నలమల అంచుల్లోని పల్లె జనాలకు వణకు పుట్టేది.దుర్మార్గానికి నిలువెత్తు రూపంగా ప్రచారం కాబడ్డ గురవడు తమను పట్టించుకోని సమాజంపై ఎత్తిన తొలిపిడికిలిగా మనం అర్థంచేసుకోవచ్చు.1930 దశకంలోఅప్పటి కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నల్లకాలువ గ్రామ సమీపంలోని నల్లమలలోని రుద్రకోడు గూడెంలో గురవడు నివసించేవాడు.చెంచుల సహజ రూపానికి భిన్నంగా గురవడు ఆరడుగుల పొడవుండేవాడు.చేతిలో అంబుబద్దతో నడచివస్తుంటే ఎదుటపడడానికి మీసాలు సుళ్ళుతిరిగిన మహమహా రైతులే ధైర్యం చేసేవారు కాదు.దర్జాగా పొలాల్లోకి వచ్చి జొన్నకంకులు,కొర్రలు,ఆరికెలు మోసినన్నిపట్టుకు పోయినాగురవన్నిఇదేమని అడిగే తెంపు ఎవరికి వుండేదికాదు.సాధారణంగాచెంచులుపంటపొలాల్లోదొంగతనంగానో,కళ్ళాలవద్ద అడుక్కునో తిండిగింజలు తీసుక పోయేవారు. అలాంటిది స్వంతచేలోకొచ్చినట్లు వచ్చి అందినకాడికి దొరలా పట్టుకు పోయే గురవడిని ఎదుర్కోలేని అప్పటి పల్లెజనాలు తమ అశక్తతను కప్పి పుచ్చుకునేందుకు అతనికి అతీంద్రియ శక్తులున్నట్లు ప్రచారం చేశారు. ఆడవాల్లను ఎత్తుకు పోయి అత్యాచారానికి పాల్పడే వాడని కూడా ప్రచారం జరిగింది.మొత్తం మీద మైదాన ప్రాంతాలలొ గురువడు ఎలాగైనా హతమార్చాల్సిన రాక్షసుడుగా ప్రచారమయ్యాడు. చెంచులు అప్పుడే కాదు ఇప్పటికి కూడా మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన,వ్యభిచరించిన చరిత్ర లేదు. కానీ చెట్టున కాసిన కాయ,అడవిన పరుగెత్తె జింకలు తన ఆహారంగా దేవుడు ఏర్పాటు చేసినవేనని భావించి,వాటిపై ఇంకోడి పెత్తనమేమిటంటూ ఎవ్వరినీ లెక్క చేయని కారణంగ ఓ చెంచు వీరుడు అందరికి శతృవయ్యాడు.అలాంటి సంధర్భంలో ఓరోజు గురవడు నల్లకాలువ గ్రామానికొచ్చాడు. తనను చూసి బయపడి పక్కకు తప్పు కుంటున్న గ్రామస్తుల పిరికి తనానికి నవ్వుకుంటూ గురవడు సారాయి అంగడి వైపు మల్లాడు.అంగట్లో కూర్చున్న ఈడిగాయన్ను బెదరగొట్టి పూటుగా మందు పుచ్చుకున్నాడు.తూలుతూ చెంచుగూడెం వెళ్ళేందుకు బయలు దేరాడు.గ్రామస్తులకు ఇది సువర్ణావకాశంలా కనిపించింది. అయినా ఎదురువెళ్ళాలంటే ఎవ్వరికైనా అదురే. బలిజ నారాయణ తొలి దెబ్బ వేశేందుకు సిద్దపడ్డాడు. మిగిలినవారు తలొ దిక్కునుండి దాడి చేయడానికి సమాయత్తమ్యారు.బలిజ నారాయణ వెనుకనుండి అనుకునట్లు గానే పట్టుడు కట్టెతో తలపై బలంగా ఒక వేటు వేశాడు.ఓగావు కేక వేసి నేలకూలిన ఆగిరిజన వీరుడిని కమ్ముకున్న తక్కినవారు అతడికి ఊపిరి సలపకుండా వేటుపై వేటు వేస్తు నిర్వీర్యున్ని చేశారు. అయినా గురవడి ప్రాణం పోలేదు. నెత్తుటి ముద్దలా వున్న గురవడి శరీరాన్ని ఎద్దుల బండి చక్రాలకు కట్టి,బండిపై మనుషులెక్కి నడిపించారు. అయినా ప్రాణాలు పోని గురవడు "ఎందుకురా నన్నిలా హింసిస్తారు నాజబ్బలోతాయెత్తులున్నాయి వాటిని తొలగించనంతవరకు నకు చావులేదని తనమరణ రహస్యం తానే వివరించి ప్రాణాలు విడిచాడు. నాటి ఇంగ్లీషు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి ఊరంతాఎదురు తిరగడంతో వారు వెనుదిరిగారు.ఈ జరిగిన కథను ఇప్పటికీ పల్లెజనంవల్లె వేస్తూనే వుంటారు.అలా ఎప్పుడో స్వతంత్రించి వ్యవస్తను లెక్కచేయక తిరగబడ్డ గురవడి జీవితం అలా ముగైసింది.సరిగ్గా మరో 7౦ డెభై సంవత్సరాల తరువాత చట్టబద్దంగా చెంచుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినందుకు మరో చెంచు వీరుడు దాసరి కొండన్నదొంగ ఎదురు కాల్పుల్లో ప్రాణాలు వదలడం యాదృఛికమైతే కాదు.పీడిత వర్గాల నుండేవారి విముక్తి వీరుడు ప్రభవించడం చరిత్ర చెప్పిన పాఠమే.

Friday, February 20, 2009

పేగు తెంచుకు కాదు.. చెంచులు పేగుదంచుకుని పుడతారు

పేగు తెంచుకు కాదు.. చెంచులు పేగుదంచుకుని పుడతారు
నిజం నల్లమలలో చెంచులు పేగుతెంచు్కోవాలంటే వాళ్ళమ్మ పేగు దంచు కోవలసిందే. నిండు గర్భిణులైనా చెంచుతల్లులు, ఆహార సేకరణలో మగనితో పాటు అడవుల వెంటవెళ్ళాల్సిందే.అలాంటప్పుడు నొప్పులువచ్చి కాన్పు ఆయితే పిల్లను తల్లిని కలిపి ఉంచిన పేగుక్రింద ఒక రాయిని పెట్టి,పైన ఇంకో రాయితో మెల్లగా దంచుతూ ఆచెంచు తల్లి పిల్లవాని ప్రేగు తెంచుతుంది.పగలంతా పొలంలో పత్తి ఒడిపి,గోతానికి కుక్కి,ఆగోతం మోసుకు వచ్చి రైతు ఇంట వేసి ఇంటికి వెళ్ళి ప్రసవించే రైతు కూలి తల్లి చెంచుతల్లి దుస్థితిని చూసి అయ్యో అనుకోవచ్చు.కాని నెలనెలా డాక్టరు ప్రర్యవేక్షణలో పొట్టలోని శిశువు బాగోగులు చూస్తు,కాలు కిందపెట్టనీయని భర్త సేవలో(ఆమె కోసం కాకపోయినా వారసుడికోసం)నెలలునింపుకుని నొప్పులొస్తయేమోనన్న భయంతో ఇంజక్షన్ లు వేయించుకునోకాదంటే సిజేరియన్ ద్వారా సుఖప్రసవం(?) పొందే కార్పోరేట్ తల్లులకు మాత్రం చెంచుతల్లి పేగు దంచుడు జుగుప్స కలిగించితీరుతుంది. మానవ సమాజం చెంచులను కనీసం తోటి మనుషులుగా కూడా గుర్తించకపోవడం వల్లే వారు ఇంతటి దయనీయస్తితిలో నేటికి బతుకు(?)తున్నారు.
ప్రపంచాన్ని మారుస్తామని కనీసం వ్యక్తులుగా తమనుతాము మార్చుకోలేని కమ్యూనిస్టులుకాని,మనుషులతో కాదు మతంతోనే మకు పని అనే కాషాయ వీరులుగాని,గరీబీకాదు..గరీబోంకో హఠావో అనే కాంగ్రేస్ వారు కాని ఎవ్వరూ వీరి వంక చూసిందిలేదు. వీరి బతుకుల్లో ఏదన్నా చిరు మార్పు వచ్చిందంటే శర్మ లాంటి ఒకరిద్దరు ఐటిడిఏ అధికారుల వల్లే. వారిలో పెను మార్పును అభివృధ్దిని కోరుకుని ఆమార్గంలో కొంత ముందుకు నడచిన వన దేవతలను(చెంచుల దృష్టిలో) ప్రజాప్రభుత్వం నల్లమలలోనే లేకుండాచేసింది.ఇక ఇప్పుడు చెంచులకు దేవుడే దిక్కను కోవాలేమో. సిరికింజెప్పక.. శంఖచక్రగధాయుధంబుల కైదోయి సధింపకనే ...నేకుగా అర్తరక్షణకు బయలుదేరడానికి చెంచులలాగే వాళ్ళదేవుల్లు అణగారినవారే. ఈదన్న,ఈరడు మంతనాలమ్మ మొదలయిన వారి దేవతలకు చెంచులు ఏనాడు దూపదీప నైవేద్యమ్ముల నందించిందిలేదు, వారు వీరికి అభయమిచ్చి అదుకుంది లేదు.

Wednesday, February 18, 2009

చెంచులను జంతువుల్లా వేటాడిన ఖాకీలు ... నల్లమల చెంచులు నేడు గాయపడ్డ లేడి కూనలు

వంద కోట్లకు పైబడిన భారత జనాభాలెక్కల్లో తామూ అంకెలమేనని పాపం నల్లమల చెంచులకు తెలియదు.సౌకర్యవంతంగా, స్వేఛ్ఛగా, గౌరవంగా బతికే పౌరహక్కులున్నట్లు వారి కసలే తెలియదు.పొద్దు పొడిచింది మొదలు అడవుల్లో తిరుగుతూ ఆపూటకేది దొరికితేఅది తింటు దొరక్కపోతే పస్తులుండే నిర్భాగ్యపు బతుకులు చెంచులవి.మండే కడుపులో మంట చల్లార్చుకునేందుకు చెంచులు యాప(వేప కాదు) బెరుడును కాల్చి బూడిద చేసి ఆ బూడిదను బాగా తడిపి అందులో చింత పండుకలుపు కుని తింటూ వుంటారు. దీంతో కడుపు మంట చల్లారడమేమో గాని విరేచనాలు పట్టుకుని ఆ అమాయకులు మృత్యు ముఖానికి చేరుకుంటుంటారు. అలాంటి చెంచులు అడవుల్లో అన్నలతో మాట్లాడారనో,వారికి వుపయోగపడారనో పోలీసుల చేత చిత్రహింసల పాలైయ్యారు.అప్పుడప్పుడు బూటకపు ఎన్ కౌంటర్లకు బలవుతూనే వున్నారు. పెచ్చెరువు చెంచు గూడెం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి సుమారు యాభై కిమీ దూరంలో నడి నల్లమలలో ఉంటుంది.అక్షరం ముక్కరాని చెంచుజాతిలో ఆ గూడేనికి చెందిన దాసరి కొడన్న పదవతరగతి వరకు చదవడమంటే గొప్పే. గూడెంలో చౌకధరల దుకాణం నడుపుకునే కొండన్న అటు గూడెం లోను,ఇటు ఆత్మకూరు పట్టణంలోను అందరికి తలలోని నాల్కలాంటివాడు. అడవిలో దారి తప్పిన ఫారెస్టోల్లకైన, పొలపర్లకైనా(కట్టెలు కొట్టుకుని బతికేవారు) కొండన్న నే ఆఅడవిలో అన్నదాత.ఒక్కోసారి అన్నలవేటలో వున్నపోలీసులు బల్వంతంగానైనా కొండన్న ఆతిధ్యం పొందేవారు. అలాగే అన్నలకు అప్పుడప్పుడు అన్నం పెట్టేవాడు.పారెస్టోడో, ఐటిడిఏ వాడో చెంచులకు కించిత్ అఅన్యాయం చేసినా వెంటనే ఆత్మకూరు పట్టణంలోని విలేఖరులకు చేరవేశేవాడు. నెలలునెలలు తన తోటి చెంచులు డబ్బులు ఇవ్వక పోయినా వారికి బియ్యం వుద్దరుగా వేశేవాడు. వారికి వీలు కుదిరి అటవి ఫలసాయం బాగా లభించి వారికి డబ్బులు వచ్చేవరకు వేచి వుండేవాడు.ఎప్పుడు తన జాతి జనం ఎలాబాగు పడతారా అనిమాత్రమే ఆలోచించేవాడు.ఓసారి వరస కరువులొచ్చి గ్రామాల్లోని రైతులే కూడులేక అల్లాడిన రోజులవి.అప్పుడు అడవిలో చెంచులస్థితి మరింత దారుణంగా వుంది. ఈ స్థితిలో కొండన్న వెయ్యి మంది చెంచులను సమీకరించి శ్రీశైలం ఐటిడిఏ కార్యాలయం ముందు ఆకలి ప్రదర్శన నిర్వహించాడు. ప్రతి చెంచు కుటుంబానికి రెండు బస్తాల బియ్యము,బస్తా జొన్నలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటి ఐటిడిఎ పిఒ వాడ్రేవు చినవీరభధ్రుడు ఈ డిమాండ్ ను ఆమోదించ లేదు. ఈస్థితిలో చెంచులకు ఆకలి చావు అనివార్యమయింది. దీన్ని నివారించేందుకు అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వం చెంచులకు ఇంటికి బస్తా బియ్యం,బస్తాజొన్నలు ఇవ్వాలని నిర్నయించి అమలు చేయడం కొండన్నకు ప్రాణాంతకంగా మారింది. ఈవ్యవహారంతో కొండన్న పీపుల్స్ వార్ పార్టీ సన్నిహితుడుగా పోలీసులు అనుమానించారు. ఆరోజుల్లొ పోలీసులకు అనుమానం వచ్చిందంటే చాలు ఆజీవికి భూమి మీద నూకలు చెల్లినట్లే. అంగటి సరుకులు కొనడానికి కొండన్న ఒకరోజు ఆత్మకూరుకు వచ్చాడు. పనిలొపనిగా షేవింగ్ చేయించుకుందామని ఓ సెలూన్ లో కూర్చున్నాడు.ఇంతలో ఎవరో ఓ వ్యక్తి సిఐ పిలుస్తున్నాడంటు కొండన్నను పోలీసుస్టేషన్ కు తీసుకు పోయాడు.అంతే ఆ మరుసటి రోజు తెల్లవారు ఝామున పోలీసులకు నక్సలైట్లకు నడుమ జరిగిన ఎదురు కాల్పుల్లో గుర్తుతెలియని ఓ నక్సలైట్ మరణించాడని పోలీసులు చేసిన ప్రకటన వచ్చింది. అప్పటికే ఆందోళనలొ వున్న కొండన్న బంధువులు సంఘటనా స్థలానికి వెల్లగా అక్కడ నెత్తుటి మడుగులో కొండన్న శవం కనిపించింది. ఆహార సేకరణదశ దాటని ఓ ఆదిమ తెగలో సమాజ గతిని అర్థం చేసుకుని తన జాతికొక దిశను చూపాలనుకున్న మనిషిని రాజ్యం కౄరంగా హ్త్య చేసింది. ఇలాంటి సంఘటనల వల్లే చెంచులు తమ కోసం ఎవరో వస్తారని ఎదురు చూసే స్థితికి చేరు కున్నారు. కొండన్న ఒకడే కాడు కొంత తార్కికజ్నానం అలవడిన చెంచులెందరో రాజ్యయంత్రం ఇనుప కాళ్ళాకింద నలిగి పోయారు. ఇలాంటి దశలో చెంచును ప్రగతి వైపు తీసుకు పోయేదెవరు.

Tuesday, February 17, 2009

చదువు సాగదు...బతుకు మారదు

అపుడెప్పుడో వినేవాళ్ళం.చెంచు రేంజర్ అని, చెంచు ఫారెష్టరని.అంటే తెల్లవాడి పాలనలో కొదరు చెంచులకు చదువబ్బిందని అర్థమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 6దశాబ్దాలు గడచినా నాలుగు జిల్లాలలోని అన్నిచెంచు గూడేలు పరికించి చూసినా పదవ తరగతి పాసైన చెంచు బాలుడు ఒక్కడు కనిపించడు.ఇటీవల ప్రారంభమైన రామచంద్రమూర్తి hmtv కోసం చెంచు జాతికి చెందిన రిపోర్టర్ కోసం వెదికారు. కనీసం టెంత్ పాసైతేచాలు అంతానేర్పించు కుంటామని రామ్మోహన్ గారు అక్కడక్కడా వాకబు చేశారు.ఎంతో వెతుకులాట తరువాత ఒ అబ్బాయి దొరికాడు. అతడి తండ్రి కి ఎలాగో కాస్త అక్షర జ్నానం రాగా అటవీ శాఖలో చిరు ఉద్యోగ చేయడం ద్వారా కొడుకును చదివించుకో గలిగాడు. ఇదీ చెంచుల్లో విద్యాపరిస్థితి.మరి ప్రభుత్వమేం చేస్తోంది అన్న అనుమానం మీకు కలగవచ్చు. చెంచుల అభివృధ్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీ ITDA ఆధ్వర్యంలో నాలుగు జిల్లాలలో దాదాపు 200 వివిధ స్తాయిల్లోని పాఠశాలలు ఉన్నాయి.శ్రీశైలంలో ఒ పాలిటెక్నికల్ కళాశాళ కూడా వుంది. సమీకృత గిరిజన వసతి గృహాలున్నాయి.ఇన్ని వున్నా మరి చెంచులకు చదువెందుకబ్బదు.ప్రభుత్వ అధికారులలోని చిత్తశుద్ది లోపం,అవినీతి ఇందుకు కారణాలుగా భావించ వచ్చును. అయితే ప్రధాన కారణం మాత్రం విద్యాభోధనలో అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానమే అని చెప్పవచ్చు. చెంచులు ప్రకృతి మాత ముద్దుబిడ్డలు.చెట్లవెంట,పుట్టలవెంటతిరుగుతూనే పెరిగి పెద్దవారవుతారు. అలాంటివారిని నాలుగు గోడల మధ్య బంధించి బెత్తాలతో బెదిరిస్తె సున్నిత మనస్కులై చెంచులకు రుచిస్తుందా. ఇక్కడా అదే జరిగింది.కడుపునిండా తిండి లేని చెంచులపిల్లలు అన్నం వేళల లో మాత్రమే హాస్టల్ల వైపు పరుగులు తీస్తారు. "శామీ బువ్వపేట్టు..." అంటూ తమ అన్నాన్ని తామే అడుక్కుంటుంటారు.పై మీద చింకిపాత తప్ప ఈ చెంచుపిల్లగాళ్ళు వేరెరుగరు. అయితే ఇటిడిఎ లో పని చేసే ఏచిన్న ఉద్యోగి పిల్లలైనా సరే సీతాకోక చిలుకల్లా రంగురంగుల యూనిఫాం లలో పట్టణాలలోని ప్రవేటు కాన్వెంట్లకు వెళుతూ కనిపిస్తారు.పెద్దపిల్లలయితే పల్సరు బండ్లపై తప్ప కాలు కింద మోపరు.వీళ్ళకు ఈ సొమ్మంతా చెంచుల పేర జమ రాసుకుని బొక్కిన సొమ్మేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. చెంచు పిల్లలను వెంట బెట్టుకుని కొండల్లో తిరుగుతూ చెట్టు పుట్టాచూపుతూ ప్రకృతిపరంగా చెప్పాల్సిన విధ్య రొడ్డకొట్టుడుగా మారడం విచారకరం. తెలుగు పత్రికలు చదివేవారికి వాడ్రేవు చిన వీరభధ్రుడు తెలిసేవుంటారు.అభ్యుదయవాదిగా,సున్నిత మనస్కుడిగా ఆయన రచనల ద్వారా మనకర్థమవుతారు.ఆయన కూడా చెంచుల కోసం ఏర్పాటు చేసిన శ్రీశైలం ఇటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా పని చేసి వుండడం కొసమెరుపు.

Sunday, February 15, 2009

చెంచు జాతి హననాన్ని వేగవంతం చేసిన అభయారణ్యం----------------------------------------------------------------------ఎప్పుడో ఏకాలం నాడో ఓ తమిళుడు పచ్చటి శోభతో వెలుగుతున్న ఆ కొండలను చూసి "నల్లమలై"(మంచి కొండలు) అన్నాడు. అలా నామకరణం గావించ బడ్డ నల్లమలలు అధ్బుత మైన ప్రకృతి రమణీయతకు నేటికీ చిరునామాగా వుంటూ ఉన్నాయి.వేలాది చ.కిమీ పరిధిలొ విస్తరించిన ఈ అడవులు జీవవైవిధ్యానికి(Bio diversity) పెట్టింది పేరు.ఇక్కడ వున్నన్ని వృక్షజాతులు,జంతుజాలము,వనమూలికలు,క్రిమి కీటకాలు మరెక్కడా కనిపించవు. సింహము,ఏనుగు తప్ప వన్యజీవులైన అన్ని స్థన్యజీవులు నల్లమలలొ వుండడం విశేషం.
దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ బెంగాల్ టైగర్లకు నల్లమలలోనే అభయారణ్యం ఏర్పాటు చేశారు.కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దాటిన తరువాత kgరోడ్డు కు ఎడమవైపు మొదలైయ్యే నల్లమల అడవి అలాగే కృష్ణాతీరం దాటి ఆవలి ఒడ్డున వున్న మహబూబ్ నగర్ జిల్లాలోని అడవిని కలుపుకుని వేలాది చ.కి.మీ మేరా "శ్రీశైలం- నాగార్జునసాగర్" వైల్డ్ లైఫ్ సాంక్చురీ పేరుపై ఈ అభయారణ్యం ఏర్పాటైయింది. నిజానికి పులిని పర్యావరణ సూచిగా భావించవచ్చు. పులి కదలికలు,పునరుత్పత్తి,జననరేటు తదితర అంశాలు అడవి లోని మిగిలిన జంతుజాల జీవన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది.పులి దాదాపు నలభై చ.కి.మి పరిధిలో ఆధిపత్యం వహిస్తుంది.పర్యావరణ శాస్త్రవేత్తలు అడవిని మూడు ప్రధాన జోన్ల్ గా విభజిస్తారు.అవి 1.టూరిస్ట్ జోన్(జనం తమ అవసరాల కోసం తిరుగాడే గ్రామాల సమీపంలో వుండే అడవి ప్రవేశ ప్రాంతం)2.బఫర్ జోన్(గడ్డి మేసే జంతువులు తిరుగాడే ప్రదేశం)3.కోర్ జోన్( అడవి మద్యభాగము(జనసంచారంలేని దట్టమైన చోటు) పెద్దపులి కోర్ జోన్లో తన టెరటరీని స్తాపించుకుంటుంది.పులి మనుషులకు ఎప్పుడు హానికారిణి కాదు.అడవిలో పులిని మనిషి ఒకసారి చూస్తె పులి మనిషిని వేయి సార్లు చూసి ఉంటుందని జానపదుల సామెత.మనిషిని చూస్తె తప్పుకునే స్వభావం పులిలో ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ మనిషే పులిపాలిట యమదూతగామారి, వాటి సంఖ్య దారుణంగా పడిపోవాడానికి కారణమవుతున్నాడు.అయితే చిత్రంగా వేల సంవత్సరాలుగా అదే నల్లమలలో పులులతో సహజీవనం చేస్తున్న చెంచులు మాత్రం పులులకు ఏనాడూ కీడు తలపెట్టడం కానీ పులులు చెంచుల మీద దాడి చేసిన సంఘటన కానీ రికార్డు కాలేదు. మీదు మిక్కిలి మైదాన ప్రాంతాల నుండి అడవిలోనికి వేటకు వచ్చే వారిని చెంచులు తరిమి కొట్టిన సంధర్భాలు కూడా వున్నాయి. నల్లమలలో వున్న పురాతన ఆలయాలను గుప్త నిధుల వేటగాళ్ళ నుండి ఎన్నోమార్లు కాపాడిన ఘనత చెంచులకు వుంది. అయినప్పటికీ ప్రభుత్వం పులుల అభయారణ్యం కోసం చెంచులను వారి సహజ ఆవాసాలకు దూరంగా పునరావాసం పేరిట తరిమి వేసింది. అసలే జన్యు వైవిధ్యం లేక ,పౌష్టికాహార లోపం వల్ల చెంచుజాతి వేగంగా క్షీణించి పోతోంది. అలాంటి విలుప్తమవబోతున్న జాతిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అశాస్త్రీయంగా పులుల సంరక్షణ పేరిట వారు మరింత వేగంగా నశించి పోయే పునరావాస ప్యాకేజ్ కి పాల్పడింది. తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో చెంచులు తిరిగి అడవిలోనికి ప్రవేశించారు. తమదైన అడవిలొ నేడు వారంతా తమది కాని బతుకు బతుకు తున్నారు.

Tuesday, February 10, 2009

చెంచుల ఆశాకిరణం పొడిచింది... అస్తమించింది______________________________________________________________________నల్లమల చెంచులు అడవి లోని జంతువుల కంటె హీనంగా బతుకుతూ, చెదలుకంటే కనాకష్టంగా బతుకు ముగిస్తున్న విషయం ముందు రాసిన పోస్టులలో చూసాము. చీకటి మయమైన వారి జీవితాల్లోకి కూడాకొంత వెలుగు వచ్చినప్పటికీ అది మెరుపులా మాయమైయింది.ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఉత్తర తెలంగాణాలొ ముమ్మరమైన అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం క్రమానుగతంగా దక్షిణ తెలంగాణా లో పాదుకుంటున్న సమయంలోనే అనివార్యంగా ఆ పార్టీ సాయుధ కార్యకర్తలు నల్లమలలోకి ప్రవేశించారు. మొదట మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాలలొ ప్రవేశించిన వీరు ఆతరువాత గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాలలొని నల్లమల అడవులను తమకు రక్షణ దుర్గాలుగా మలుచుకున్నారు.అప్పటికి ఖాకీ రంగు దుస్తులు ధరించి తమను గొడ్లను బాధినట్లు బాదిన మలబారు పోలీసుల(తెలంగాణ సాయుధ పోరాట కాలం) గురించి,తాము పొలాల్లో జొన్న కంకులో,వడ్లగింజలో తెచ్చుకోను పోతే చావచితక్కొట్టిన తెల్ల బట్టల రైతుల గురించి మాత్రమే తెలిసిన చెంచులకు ఆలివ్ గ్రీన్ రంగు దుస్తుల్లో మెరిసి పోతున్న సాయుధులు మొదట వింతగానే కనిపించారు.వారు ధరించిన దుస్తుల్లో తేడా వున్నట్లే వారి ప్రవర్తనలో తేడాను కూడా అడవి బిడ్డలు పసిగట్టారు.అప్పటి నుండి ఏ చెంచు గూడేనికైనా దళం వచ్చిందంటె చాలు కడుపు నొప్పి నుండి జ్వరాలదాకా బీమారీ ఏదైనా సరే చెంచులు అన్నలనే ఆశ్రయించేవారు. దళం డాక్టరు కూడా తన పరిమితి మేరకు కిట్ లో వున్న మందులతో వారికి వైద్యం చేసేవాడు.అన్నలు గూడేలలో చదువులు చెప్పేవారు. ఈ క్రమంలోనే శుభ్రత, ఆరోగ్య సూత్రాలను పాటించడం కూడా వారికి అన్నలు వంట బట్టించారు. అయినప్పటికి చెంచులు తాగుడును మానుకోలేక పోవడం వారి అభివృధ్దికి ఆటంకంగా మారింది. కడుపుకు తినే తిండిని ముట్టుకుంటే రైతులు ఎందుకు వెంటపడి తరిమితరిమి కొడతారో అర్థం కాని చెంచులకు వారి లాగా తామూ పంటలు పండించాలని ఆశపడేవారు. ఐటిడిఏ వాళ్ళు అప్పుడప్పుడు ఎద్దులు ఇప్పిస్తామంటూ పట్టణాలకు తీసుకు వెళ్ళినపుడు అక్కడ కనిపించిన ఎద్దులన్నీ తమవయితె బాగుండని వారి కనిపించేది. కానీ ఫోటోల వరకే అవి తమతో వుండేవి.ఆతరువాత తాగడాని బ్రోకర్లు ఇచ్చే డబ్బులు తమను మైకంలో ముంచి తేల్చేసరికి అవి మళ్ళీ కనిపించేవి కావు. వ్యవసాయం చెంచులకు ఎప్పుడు ఫలించని స్వప్నంగానే వుండేది. అందుకే అన్నలు చెంచులకు సేద్యం మీద వుండే మక్కువను వుపయోగించి వారిని మద్యపానానికి దూరం చేసే పని మొదలు పెట్టారు. గూడెమంతా ఓ కట్టుబాటుకు వచ్చి సామూహికంగా మద్యపాన నిషేధం పాటిస్తే ఆగూడేనికి వ్యవసాయం నేర్పేందుకు పీపుల్స్ వార్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకు అవసరమైన భూమి తయారు చేయడంతో పాటు ఎద్దులు, పెట్టుబడి అంతా వారే సమకూర్చేవారు.మైదాన ప్రాంతాల నుండి రైతులను పిలిపించి చెంచులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పించేవారు.అప్పటికే వ్యవసాయంలో కొంత జ్నానం సంపాదించిన మహబూబ్ నగర్,ప్రకాశం జిల్లాలలోని చెంచులతో పాటు కర్నూలు పరిధిలోని నల్లమల చెంచులు తమ జీవన పరిణామ క్రమంలో వేల సంవత్సరాలుగా జరగని మార్పును ఇలా ఒక్కసారిగా పొందారు. ఈక్రమంలో ఎంతోమంది చెంచులు ఉద్యమాలలోకి కూడా వెళ్ళారు.అప్పటికే పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచుతున్న రాజ్యానికి మత్తుకు దూరంగా పచ్చగా కనపడే చెంచు గూడేలు ఉద్యమ ప్రాంతాలుగా కనిపించ సాగాయి.దీంతో తాగని ప్రతి చెంచు, ఓ నక్సలైట్ గాను, వ్యవసాయం చేసుకునే గూడేలు విముక్తి ప్రాంతాలుగా కనిపించ సాగాయి.అడవి బిడ్డలు ఘోరమైన రాజ్య హింసకు గురయ్యారు.తాగని చెంచుకు తన్నులు నిత్యకృత్యమయ్యింది.అన్నలు గూడేల వైపునే కాదు నల్లమలలోనే లేకుండా చేయడంలో రాజ్యం సఫలీకృతమయ్యింది. నేడు తిరిగి నల్లమలలో మట్టిగొట్టుకుని పడివున్న చెంచులు మన కళ్ళకు కనిపిస్తారు. బక్కచిక్కిన శరీరాలతో కళ్ళళ్ళో ప్రాణాలు నిలుపుకుని ఎవరి రాకకోసమో ఎదురుచూస్తు నేలకు కర్చుకుని వున్నారు. వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు మరింత జోరుగా వారి పేరున పద్దులు రాసి కోట్లాది రూపాయలను కైంకర్యం చేస్తూ ఉన్నాయి.

Wednesday, January 21, 2009

వనవాసాన్ని మరపించని పునరావాసంచెంచుజాతి క్షీణత మరింత వేగవంతం: రాయల్ బెంగాల్ టైగర్ గా పిలుచుకునే పెద్దపులులు దేశంలొ విలుప్తమవుతున్న జాతిగగుర్తించబడడం,చెంచు జాతికి ప్రాణసంకటంగా మారింది.నల్లమలను పులుల ఆవాసకేంద్రంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వము ఐదు జిల్లాల పరిధిలొ దేశంలోనే పెద్దదైన పులుల అభయారణ్యం శ్రీశైలం-నాగార్జునసాగర్ వైల్డ్ లైఫ్ శాక్చురీని ఏర్పాటు చేసింది.సుమారు పదివేల చ.కిమి పరిధి లొ విస్తరించిన తూర్పు కనమలలో భాగమైన నల్లమల అడవుల్లో మూడింట ఒక వంతు పైగానే పులుల అభయారణ్యం కోసం కేటాయించారు.దీంతో నట్టనడిమి నల్లమలలో తమ సహజ ఆవాసాలలో నివశించే చెంచులు తమతమ గూడేలు విడిచి మైదాన ప్రాంతాలకు పునరావాసం పేరిట వెళ్ళాల్సి వచ్చింది. మొక్కను పెరికి నాటితె బతుకుతుంది కాని చెట్టును పెరికి నాటితే బతుకుతుందా? అలాగే ఈ పునరావాసం చెంచుల పాలిటి శాపంగా మారింది.
ప్రభుత్వ ధాఖలాలో మాయమైన గిరిజన గ్రామము: కర్నూలు- గుంటూరు ప్రధాన రహదారిలో ఆత్మకూరు దాటిన తరువాత నలమల లో సుమారు 25km దూరం వెళ్ళాక ఎడమ వైపు ఓ మట్టి రోడ్డు ప్రారంభ మవుతుంది. ఈ దారిలో మరో 30km అడవిలో ప్రయాణం చేస్తే చిన్నిచిన్ని అందమైన గుడిసెలు కనిపిస్తాయి.అది చెంచుల రాజధాని అనదగిన పెద్దచెరువు చెంచుగూడెము. ఈగూడెంలో చెంచులే కాకుండా బోయలాంటి వెనుకబడ్డ కులాలతో పాటు,సుగాలి వంటి మైదాన ప్రాంత గిరిజన తెగల ప్రజలు కూడా ఇక్కడే జీవించేవారు.దాదాపు వెయ్యి మంది జనాభా వున్న ఈగూడేన్ని పులుల అభయారణ్యం కోసం ప్రభుత్వము ఖాళీ చేయించింది. పక్కనే చెరువు,పచ్చని అవాసం, అన్నీ విడిచి అక్కడి జనాభ పెద్దచెరువుకు దాదాపు 60km దూరంలో వున్న కొట్టాల చెరువు అనే మైదాన ప్రాంతానికి ప్రభుత్వముచే తరలించ బడింది. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పెచ్చెరువులో ప్రభుత్వ ఆసుపత్రి, బాలికల వున్నత పాఠశాలను నిర్వహించింది.అటవీ,ఆరోగ్యశాఖల ముఖ్య కార్యాలయాలు ఇక్కడే వుండేవి. అలాంటిది ఏకంగా స్వతంత్ర భారత ప్రభుత్వం మాత్రం నశించి పోతున్న ఓ జంతు జాతిని ఉద్దరించడం కోసం విలుప్త దశలో వున్న మరో ఆదిమ మానవ జాతిని అశాస్త్రీయంగా పునరావాసం పేరిట తమ సహజ ఆవాసాలకు దూరంగా తరలించడంతో చెంచు జాతి మరింత క్షీణించడం మొదలైంది. గుర్తు తెలియని రోగాలతో ఎందరో చెంచులు పునరావాస గ్రామాలలో మరణించ సాగారు.చచ్చినవారు చావగా, మిగిలిన కొందరు తిరిగి తమ పాత గ్రామమైన పెచ్చెరువుకు తిరిగివెళ్ళారు.అప్పటికే రెవెన్యూ గ్రామముగా ప్రభుత్వ రికార్డుల నుండి పెచ్చెరువు తొలగి పోయింది.దీంతో వీరు ఓటుకైనా రేషన్ బియ్యానికైనా 40కి.మీ నడచి వెళ్ళాల్సి వస్తోంది.అసలు మొదటనుండి కూడా ఎలాంటి ప్రభుత్వ లెక్కదాఖలా లేని అటవీ గూడేలు నల్లమలలో ఎన్నో ఉండి చివరకు తమ ఉనికిని కూడా నిలుపు కోలేక కనుమరుగయ్యాయి.ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామ పరిధిలొనినల్లమలలో రుద్రకోడు,పసురుట్ల అనే చెంచు గూడేలుండేవి.ముప్పై సంవత్సరాల క్రిందట అడవిలోని విప్పపూలు,సిరిమాని బంక,ఉసిరి,కుంకుడు కాయలు,చింతపండు,షర్బత్ గడ్డలు సేకరించి అమ్ముకుంటు జీవనం సాగిస్తూ హాయిగా ఉండేవారు. వారిని నాగరిక(?) సమాజంలోనికి తీసుకు వచ్చేందుకు అంటూ ప్రభుత్వం వారిని నల్లకాలువ గ్రామ సమీపంలోకి తీసుకు వచ్చి పునరావాసం కల్పించింది.ఆహారసేకరణ దశలోనే వున్న చెంచులకు వ్యవసాయ భూములందించింది.అయితే సరిగ్గా ముప్పై సంవత్సరాల తరువాత యాభై కుటుంబాలతో వచ్చినవారు పది కుటుంబాలు మాత్రమే బతికి బట్ట(?) కట్టగలిగారు.వీరి భూములు గ్రామాలకు చెందినవారి పాలయ్యాయి.చెంచులు రోజు గ్రామంలో అడుక్కు తిని బతకాల్సి వస్తోంది.స్వంతంగా కాచుకుని సారా సేవించిన వీరు గ్రామాలలో సారా కొని తాగేందుకు డబ్బులు ల కోసం దొంగలుగా మారాల్సి వస్తోంది.వ్యభిచారమంటే ఏమిటో తెలియని వారిలో కేవలం ఒకకప్పు కాఫి కోసం స్వంత భార్యతో వ్యభిచారం చేయించే వారు కూడా బయలు దేరారు.చివరకు 2000రూపాయలకు భార్యలను అమ్ముకునేవారు కూడా ఆజాతిలో తయారయ్యారు.ఇదంతా అశాస్త్రీయమైన పునరావాస ఫలితమేనన్న విషయం ఎందరికి అర్థ మవుతుంది.చెంచుల అభివృధ్దికోసమని ITDA అన్న సంస్థ ఉన్నా అది అందులోపని చేస్తున్న ఉద్యోగులను మాత్రమే కోటీశ్వరులను చేసింది.చెంచుల అభివృధ్ది మాత్రం ఇప్పటికీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందాన మారింది.

Monday, January 12, 2009

చెంచులు అడవి తల్లి ముద్దుబిడ్డలు...దొడ్డ సంస్కృతికి జీవగడ్డలు<>నల్లమల అడవుల్లో మాత్రమే జీవించే చెంచుల(primitive tribe) అలవాట్లు,జీవన విధానం,సంస్కృతి వైవిధ్య భరితంగా ఉంటుంది. చేతిలొ విల్లంబులు,బుజాన గొడ్డలి,ముందు పెంపుడు కుక్క,వెనుక భార్య..ఇది పొద్దున్నే ఆహారసేకరణకు అడవి లోకి బయలు దేరే చెంచన్న తీరు. ఆరు నూరైనా ఇదిమారదు.పులి,రేచు కుక్కలు(wild dog's) లాంటి మాంసాహార జంతువులు వేటాడి వదలిన మాంసము,అడవుల్లో వుండే రకరకాల దుంపలు వీరి ఆహారం.ఆకలి తీరితే అడవిలోని పొదలే వీరి శయ్యాగారాలు. పగటి పూటే వీరి శృంగారం.రాత్రి మైధునం వీరికి నిశిద్దం.మగ్గి నేలరాలిన విప్ప పువ్వులను సేకరించి అధ్బుతమైన మధ్యాన్ని తయారు చేసుకుని సేవిస్తారు. ఇందుకు ఆడా,మగా,పిల్లలన్న తేడా లేదు. చెంచుల్లో మద్యపానం మొదట వ్యసనం కాదు. ఆహారపు అలవాటు మాత్రమే.ఇష్టపడ్డ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించ డంతో వీరి పెళ్ళీ తంతు మొదలవుతుంది. తరువాత కొత్తబట్టలు తెచ్చి వాటిని ధరించి మేకనొ,గొర్రెనో కోసుకుని తిని తెల్లవార్లు ఆడిపాడీ అలసిసొలసి పడిపోవడంతో పెళ్ళి తంతుముగుస్తుంది. రాత్రంతా సారాజోరు సాగుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.గొలుసన్న,ఈదన్న,మంతన్న లాంటిపేర్లు పెట్టుకుంటారు. తమదైన గిరిజన మాండలికంలో తెలుగు భాషనే మాట్లాడతారు.వెదురు బొంగులు,అడవిలో లభించే కాశిగడ్డితో వేసుకున్న చిన్న అందమైన పూరిగుడిసెలలో నివాసముంటారు. ఈగుడిసెలు వర్తులాకారంలో ఎంతో అందంగా ఉంటాయి. APటూరిజం వారు కూడా వీటి ఆకారం లోనే తమ రిసార్ట్ లను నిర్మించడం వీటి విశిష్టతను తెలియజేస్తుంది.ఇంతటి అందమైన ఇళ్ళు ఉన్నప్పటికి చెంచులు వీటిలో పగలు మాత్రమే ఉంటారు.రాత్రిళ్ళు ఇళ్ళలో పడుకుంటే పైకప్పు కూలి మరణిస్తామన్న మూఢనమ్మకంవల్ల ఆరుబయట నిద్రిస్తారు.ఇందుకోసం వీరు తయారు చేసుకున్న శయ్య కళాత్మకంగా ఉంటుంది. లావుపాటి వెదుర్లను పగలగొట్టి మంచ పై పరచడం వల్ల వెదురు పానుపు తయారవుతుంది.ఇది ఒరకంగా రచ్చబండలా ఉంటుంది.చెంచుల శరీరంలో భాగంగా మారిన విల్లంబుల తయారీలో కూడా చెంచుల కళాత్మకత ఉట్టిపడుతుంది.వింటికి అవసరమైన దబ్బ,వింటి నారి ఆసాంతం వెదురుతోనే తయారు చేసుకోవడం విశేషం. వెదురుతో ఎంతొ పనితనం ఉట్టిపడేలా తయారు చేసిన ఊసల ఓచివర ఇనుముతో బాణపు ములికిని పొదుగుతారు. రెండవ చివర గురిని నియత్రించడానికి పక్షి ఈకలనుఅమర్చుతారు.నల్లమల చెంచులు ఉపయోగించే ఈఅందమైన విళ్ళంబులను ప్రముఖ దర్శకుడు కేవిరెడ్డి తన శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో ప్రత్యేకంగా తెప్పించుకుని ఉపయోగించడం విశేషం.కొండవాగులలో చేపలు పట్టేందుకు ఉపయోగించే కొడిమె ను వెదురుతో అధ్బుతంగా తయారు చేసుకుంటారు.చెంచు పిల్లలలో సృజనాత్మకత పాలు కాస్త ఎక్కువే. నల్లమల అడవులో తిరిగే అన్నలు,పోలీసుల చేతులలో కనిపించే AK47,SLRతుపాకులను ఒకసారి చూస్తె చాలు చిన్నకత్తిని ఉపయోగించి వాటి నమూనాలను చిటికెలో తయారు చేయడం వారి ప్రత్యేకత.అడవుల్లో నిర్మాణం పనుల కోసం తిరిగే ట్రిప్పర్లను ఓమారు చూస్తే చాలు వాటి నమూనా తయార్. చెంచులలొ బహుభార్యత్వం అరుదు. వ్యభిచారం లేనేలేదు.వరకట్నం ప్రసక్తి లేదు. వరుసకు బావ ఐన వాడినే చెంచులు నమ్ముతారు. సోదరున్ని అసలు నమ్మరు.అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలలో విక్రయించి తద్వారా స్వయంపోషితంగా ఉన్న నల్లమల చెంచు జాతి పరాయీకరణకు గురై కృషించి పోతున్న వైనం పై మరోసారి చర్చిద్దాం<>

Sunday, January 11, 2009

నల్లమలలో మానవ జాతి అంతరించి పోతోంది ఎవరికైనా పడుతుందా............ తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అంటే చాలామందికి మావోయిస్టులు,వారిని వెంటాడి వేటాడిన గ్రేహవుండ్ పోలీసుల గురించి మాత్రమే తెలుసు.కాకపోతే కొందరు భావుకులకు దేవులపల్లి భావ కవితా ఝరికి ఆలంబనగా నిలిచిన ప్రక్రుతి రమణీయత గుర్తుకు రావచ్చును. కానీ ఇంకా ఆహారసేకరణ దశలోనే వున్న ఆదిమ గిరిజన తెగ అయిన చెంచులు కేవలం ఈ నల్లమలలో మాత్రమే వున్నారని,వారి జనాభా వేగంగా తరిగి పోతూ ప్రస్తుతం ముప్పై వేలలోపుకు చేరిందని, ఈ పతనం మరింత వేగవంతమై మరో రెండు మూడు దశాబ్దాల లోపే ఈజాతి నిర్మూలనై పోతోందని చాలా మందికి తెలియదు.ఒకప్పుడు స్వయంపోశితంగా ఉన్నత దశ అనుభవించి నేడు ఆకులు రాలినట్లు రాలిపోతున్న ఈ జాతిని తోటి మానవులుగా ఆదుకోవాల్సిన భాధ్యత మన మీద లేదంటారా ? కాని చెంచుల అభివ్రుద్ధి కోసం ఓ ప్రభుత్వ సంస్థ, దాని ద్వారా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించినట్లు కనిపించినా కట్టుకోవడానికి గోచిపాతే వారికి ఇప్పటికీ గతి.ఓ రకం చెట్టు బెరుడును కాల్చి ఆబూడిదలో చింతపండును వేసి నీళ్ళు కలుపుకు తినే పరిస్థితే ఇంకా కొన సాగడం ఎంత అమానవీయం. ఇలాంటి తిండి వల్ల చెంచులలొ సమగ్ర ఆహార లోపం ఏర్పడి అనారోగ్యం పాలై రాలి పోతున్నారు. వేలాది సంవత్సరాలుగా చెంచులలో వర్ణసంకరం జరగక పోవడంతో జన్యువైవిధ్య లేక రోగనిరోధక శక్తిని కోల్పోతున్న వీరికి ముప్పై,నలభై సంవత్సరాలకే నిండు నూరేళ్ళు నిండుతున్నాయి. కర్నూలు,మహబూబ్ నగర్,ప్రకాశం,గుంటూరు,నల్లగొండ జిల్లాలలో విస్తరించిన నల్లమలలో పులుల అభయారణ్యంకోసం చెంచులను పునరావాసం పేరిట వారి ఆవాసాలకు దూరం చేయడంతొ వీరిలో కొంత జననస్టం జరిగింది.తనదైన పారంపరిక సంస్క్రుతి నాశనమైయ్యింది.ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ వల్ల ఇదే పరిస్తితి తలెత్తింది. పాలకవర్గాలనిశ్క్రియాప్రియత్వంతో్జాతిహననానికి గురవుతున్న చెంచుస్వేఛ్ఛకోసం మళ్ళీ మరికొంత సమాచారాన్ని పంచుకుందాం.

Sunday, January 4, 2009

ముందుగా ఓ మాట

మన బతుకు మనం గౌరవంగా, సౌకర్యవంతంగా గడపలేని పలు నిర్బంధాల నడుమ జీవిస్తున్నాం. ఈ నిర్బంధాల సంకెలలను ఛేదించుకొని స్వేచ్ఛగా, విహంగంలా జీవించే అవకాశం కోసం...